ట్రంప్ దెబ్బకు ఏపీకి భారీ షాక్- 25వేల కోట్ల లాస్-50 శాతం ఆర్డర్స్ రద్దు..!
రష్యా చమురు కొంటున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన సుంకాలు వివిధ రంగాల్లో భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. ఇందులో ఏపీ వాటా ఎక్కువగా ఉన్న ఆక్వారంగం కూడా ఉంది. అమెరికా సుంకాల మోత దెబ్బకు ఏపీ నుంచి రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ట్రంప్ సుంకాల మోత మొదలైన దగ్గరి నుంచి ఇప్పటివరకూ ఒక్క ఏపీ రొయ్యల రంగమే 25 వేల కోట్లు నష్టపోయింది.
ట్రంప్ భారతీయ వస్తువుల దిగుమతులపై తొలుత 25 శాతం సుంకాలు విధించారు. ఆ తర్వాత దాన్ని 50 శాతానికి పెంచారు. ఈ ప్రభావం ఏపీలో ఆక్వారంగంపై తీవ్రంగా కనిపిస్తోంది. ట్రంప్ సుంకాల కారణంగా రొయ్యల ఎగుమతి నష్టాలు ఏకంగా 25 వేల కోట్లకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 50 శాతం రొయ్యల ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయి. ఇప్పటికే ఎగుమతి అవుతున్న సుమారు 2,000 కంటైనర్లపై దాదాపు రూ.600 కోట్ల సుంకాల భారం పడినట్లు అధికారులు తెలిపారు.

రొయ్యలపై ట్రంప్ గతంలో ప్రకటించిన 25 శాతం, ఆ తర్వాత ప్రకటించిన మరో 25 శాతం అదనపు సుంకాలను, అలాగే 5.76 శాతం కౌంటర్ వెయిలింగ్ సుంకాన్ని, 3.96 శాతం యాంటీ-డంపింగ్ సుంకాన్ని కలుపుకుంటే మొత్తం 59.72 శాతానికి చేరుకుంది. దీంతో ఏపీని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ఆక్వా రైతులకు జీఎస్టీలో ఊరటనివ్వడంతో పాటు ఆర్థిక ప్యాకేజీలను విస్తరించాలని కోరారు. ఆక్వా రైతులను నష్టాల నుండి రక్షించడానికి జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఆక్వా ఉత్పత్తుల దేశీయ వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

దేశంలోని రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం, సముద్ర ఎగుమతుల్లో 34 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోంది. ఈ ఎగుమతుల విలువ ఏటా రూ.21,246 కోట్లుగా ఉంది. దాదాపు 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, అనుబంధ రంగాలపై ఆధారపడిన 30 లక్షల మంది ప్రజలు సుంకాల దెబ్బకు ఇబ్బందుల్లో పడ్డారు. దీనికి తోడు అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఎగుమతులను పెంచడానికి యూరోపియన్ యూనియన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, రష్యాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రధానిని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications