వివేకా కేసులో మరో కీలక పరిణామం-ఏ1 ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి గతంలో సీబీఐ 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయలేదన్న కారణంతో మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్ ను తెలంగాణ హైకోర్టు ఇవాళ రద్దు చేసింది. దీంతో ఆయన తిరిగి కటకటాల వెనక్కి వెళ్లక తప్పడం లేదు. ఈ కేసులో సీబీఐ వినిపించిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ ఏ1గా చేర్చింది. ఆయన ఆదేశాలతోనే వివేకా హత్య జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించింది. హత్య జరిగిన సమయంలో గంగిరెడ్డి వివేకా ఇంట్లోనే ఉన్నట్లు కూడా నిర్ధారణకు వచ్చింది. అయితే గంగిరెడ్డిని అరెస్టు చేసిన తర్వాత 90 రోజులకూ సీబీఐ ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో తనకు డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. దీంతో గంగిరెడ్డికి అప్పట్లో బెయిల్ లభించింది.
కానీ ఇప్పుడు వివేకా కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండటం, గంగిరెడ్డి వంటి వ్యక్తి బయట ఉంటే సాక్ష్యుల్ని బెదిరిస్తారని, కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని సీబీఐ వాదిస్తోంది. ఇదే వాదనతో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అంతే కాదు గంగిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయేందుకు మే 5 వరకూ డెడ్ లైన్ కూడా విధించింది.
గంగిరెడ్డికి గతంలో ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ హైకోర్టు.. ఆయన మే 5లోగా పోలీసుల ముందు లొంగిపోకపోతే అరెస్ట్ చేసేందుకు సైతం అనుమతి మంజూరు చేసింది. దీంతో పోలీసులు ఈ మేరకు గంగిరెడ్డి లొంగుబాటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివేకా కేసులో ప్రధాన నిందితులందరినీ పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ.. గంగిరెడ్డిని కూడా మరోసారి విచారించేందుకు సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications