అనూహ్యం- జగన్ సలహాదారు సజ్జల ఓఎస్టీగా తెలంగాణ జైళ్ల శాఖ సూపరింటెండెంట్
ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పలువురు సలహాదారులతో పాటు ప్రభుత్వంలోని కీలక పదవుల్లో తెలంగాణ స్ధానికుల్ని నియమించారు. ఇప్పుడు అదే కోవలో జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్టీడీగా ఏకంగా తెలంగాణ జైళ్ల శాఖ సూపరింటెండెంట్ దశరథ రామిరెడ్డిని తీసుకున్నారు. ఆయన డిప్యుటేషన్ పై ఏపీలో విధులు నిర్వహించబోతున్నారు.
జగన్ సర్కారు ఇవాళ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్టీగా తెలంగాణ జైళ్ల శాఖ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న దశరథ రామిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చి సజ్జల వద్ద పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల కాలానికి ఆయన్ను డిప్యుటేషన్ పై ఏపీకి పంపేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏఫీ ప్రభుత్వం కోరిక మేరకు జైళ్ల శాఖ బాధ్యతల నుంచి దశరథరామిరెడ్డిని రిలీవ్ చేసేలా తెలంగాణ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో దశరథరామిరెడ్డి త్వరలోనే తెలంగాణ నుంచి రిలీవ్ అయి సజ్జల వద్ద బాధ్యతల్లో చేరనున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో పాటు పార్టీ బాధ్యతలు కూడా చూస్తూ క్షణం తీరికలేకుండా ఉంటున్న సజ్జల వ్యవహారాలు చూసేందుకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఓఎస్టీగా దశరథరామిరెడ్డి సజ్జల అపాయింట్ మెంట్లతో పాటు ఇతర బాధ్యతలు చూడబోతున్నారు.