నిరాశలో ప్రజలు, ఇష్టమొచ్చినట్లు పాలించొద్దు!: కోదండ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లుగా పాలిస్తామంటే కుదరదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షులు ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు. హైదరాబాదులో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇష్టారీతిగా పాలిస్తే కుదరదన్నారు.
ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం ప్రజలంతా నిరాశావాదంలోకి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ పైన సుప్రీంకు: వేణుగోపాల్ రెడ్డి
ఎంసెట్ కౌన్సెలింగ్పై యధావిధిగా ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఆగస్టు 7వ తేదీ నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి ప్రవేశాలు జరగాలన్నారు. ఆ చట్టం ప్రకారం అడ్మిషన్లు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలికి అధికారం ఉందన్నారు.
మంగళవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కౌన్సెలింగ్ను సజావుగా నిర్వహించేందుకు సుప్రీం కోర్టుకు ఆశ్రయిస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నిలుపుదల చేయాలని సుప్రీం కోర్టు చెప్పలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.