బస్సుల రవాణాపై తేల్చని టీఎస్ఆర్టీసీ ... కేసీఆర్ స్పందించాలన్న ఏపీ మంత్రి
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సుల రవాణాపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. దసరాకు బస్సులు నడుస్తాయని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తే అంతర్ రాష్ట్ర రవాణా ఒప్పందంపై ఏకాభిప్రాయం రాక బస్సు రవాణా ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ ప్రభుత్వమే అని తేల్చి చెబుతోంది. సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని బస్సుల రవాణాకు ఉన్న ప్రతి బంధకాలు తొలగించాల్సిన అవసరం ఉందని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది.
Recommended Video

బస్సుల రవాణాపై ఒప్పందం తర్వాతే ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విధించిన లాక్ డౌన్ తో అంతర్ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సుల రవాణా తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా పునరుద్ధరించబడలేదు . కేంద్రం లాక్ డౌన్ సడలింపు లతో అంతర్ రాష్ట్రాల మధ్య బస్సు రవాణా పునః ప్రారంభమైనా, తెలంగాణ రాష్ట్రం పెట్టిన మెలికలతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా ఆగిపోయింది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన ఆర్టీసీ అధికారులు రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రవాణాపై పకడ్బందీగా ఒప్పందం చేసుకున్న తరువాతనే బస్సులు నడపాలని నిర్ణయించుకున్నాయి.

తెలంగాణా సమాన కిలోమీటర్ల ప్రతిపాదన అంగీకరిస్తూ లేఖ పంపిన ఏపీ
మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ బస్సు సర్వీసులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా తిరుగుతున్న కారణంగా బస్సు సర్వీసులు తగ్గించుకోవాలని, సమాన కిలోమీటర్లు బస్సులు నడపాలని ఏపీ ముందు తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదన పెట్టింది. ఫలితంగా చర్చలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాన కిలోమీటర్లు ప్రతిపాదికన అంగీకారం తెలుపుతూ అధికారికంగా లేఖ కూడా ఇచ్చింది.
అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అంతర్ రాష్ట్ర రవాణా ఒప్పందానికి ముందుకు వస్తున్నట్లు ప్రకటిస్తూనే, నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది.

ఆర్టీసి బస్సుల రాకపోకలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి పేర్ని నానీ
దీంతో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వీలైనంత త్వరగా ఆర్టీసి బస్సుల రాకపోకలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే సమాన కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడపడానికి అంగీకారం తెలియజేస్తూ లేఖ పంపామని, టీఎస్ ఆర్టీసీ నిర్ణయమే తరువాయి అని ఆయన చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన లేఖ తమకు అందలేదని టిఎస్ఆర్టిసి పేర్కొనడం గమనార్హం.
ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సు రవాణాపై మాట్లాడిన ఆయన తెలంగాణ అధికారుల తీరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థించరని పేర్కొన్నారు.

దసరాకు బస్సులు నడపలేని కారణం ఇదే అన్న మంత్రి పేర్ని నానీ
గతంలోనే పలుమార్లు బస్సు ఎప్పుడు నడుస్తాయి అనేది సీఎం కేసీఆర్ చెప్పాలి అంటూ వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని గత మూడు నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య జరుగుతూనే ఉన్నాయని, ఎవరు ఎన్ని కిలోమీటర్లు బస్సులను తిప్పాలి.. ఏ రూట్లో తిప్పాలి అన్నదానిపై తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుదరకపోవడంతోనే , తెలంగాణ రాష్ట్రం త్వరగా తేల్చక పోవడంతోనే అంతరాష్ట్ర బస్సు రవాణా నిలిచిపోయిందని పేర్కొన్నారు. దసరా పండుగకు బస్సులు నడిపించాలని భావించామని కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం లేదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications