అక్టోబర్లో రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల వివరాలు ఇవే..
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 84,797 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,497 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా ఈ ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలకు సంబంధించిన కోటా టికెట్ల విడుదల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు.
అక్టోబర్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18వ తేదీన ఉదయం 10 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. రెండు రోజుల పాటు అంటే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవి తెరిచి ఉంటాయి. ఈ లోగా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
శ్రీవారి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా బుకింగ్ ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే- వర్చువల్ విధానంలో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరలో పాల్గొనదలిచిన వారి కోసం 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది.
తిరుమలలో అంగప్రదక్షిణం చేయదలిచిన భక్తులకు ఉద్దేశించిన ఆన్లైన్ టోకెన్లు 23వ తేదీన ఉదయం 10:00 నుంచి అందుబాటులో ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి గదుల కోటా 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతుంది.
అక్టోబర్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తారు టీటీడీ అధికారులు. తిరుమల, తిరుపతిల్లో వసతి గదులను బుక్ చేసుకోవదలిచిన వారు అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.
తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.












Click it and Unblock the Notifications