75 మందితో టీటీడీ జంబో పాలక మండలి- వారందరికీ అవకాశం : భూమన-చెవిరెడ్డి సేఫ్..!!
ప్రతిష్ఠాత్మకంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల నియామకం కసరత్తు తుది దశకు చేరింది. కేంద్రంలోని పెద్దల మొదలు పలు పార్టీలు..అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రలు మొదలు అనేక మంది ప్రముఖులు తమ వారిని ఈ బోర్డులో అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు సిఫార్సు చేసారు. వారిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు..తమిళనాడు సీఎం వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక, రెండో సారి వరుసగా వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్ గా నియమించిన తరువాత బోర్డును సైతం వెంటనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

75 మందితో టీటీడీ బోర్డు సిద్దం
కానీ, ఊహించని స్థాయిలో వచ్చిన సిఫార్సులు.. ఒత్తిడి కారణంగా నియామకం ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది. టీటీడీ నిబంధనల మేరకు ఛైర్మన్ తో సహా 25 మంది సభ్యులతో పాలక మండలి ఉండాలి. అయితే, ఇప్పుడు భారీ స్థాయిలో ఆశావాహులు ఉండటంతో ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. అందులో భాగంగా నిబంధనల ప్రకారం 25 మందితో బోర్డు సభ్యులు..మరో 50 మందిని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఒక, ప్రతీ బోర్డులోనూ తెలంగాణ.. తమిళనాడు..కర్ణాటక తో పాటుగా మహారాష్ట్ర కు చెందిన వారికి అవకాశం కల్పించటం ఆనవాయితీగా వస్తోంది.

తెలంగాణ తో సహా పొరుగు రాష్ట్రాలకు
ఇప్పుడు సైతం అదే విధంగా ఆ రాష్ట్రాల నుంచి ప్రతినిధులకు అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎవరి పేర్లు సూచించారనేది స్పష్టత లేదు. అయితే, తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రం పది మందికి సభ్యులుగా అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారని..ఆ మేరకు పేర్లు సైతం ఖరారయ్యాయని విశ్వసనీయ సమాచారం. ఇక, ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక..తమిళనాడు..మహారాష్ట్ర విషయంలో పెద్ద ఎత్తున పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

గత బోర్డులో ఉన్న వీరికి మరలా ఛాన్స్..
గత పాలక మండలిలో సభ్యులుగా ఉన్న సుధా నారయణ మూర్తి, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, జూపల్లి రామేశ్వరరావు, తెలంగాణ నుంచి ప్రతాప రెడ్డి కి అవకాశం ఖాయమని తెలుస్తోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం నుంచి ఒకరికి ఈ పాలక మండలిలో స్థానం ఖాయం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి గుజరాత్ కు చెందిన ఒకరికి సైతం బోర్డు సభ్యుడుగా నియమితులు అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు ఒక్కక్కరూ పలువురి పేర్లు సిఫార్సు చేసారు.

ఎక్స్ అఫీషియో సభ్యుల పాత్రపై క్లారిటీ
దీంతో..వాటన్నింటినీ స్క్రూటినీ చేయటం సీఎం జగన్ కు సమయం తీసుకుంది. ఇక, సినీ పరిశ్రమ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం. 25 మంది రెగ్యులర్ సభ్యులు..50 మంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమిస్తున్న ప్రభుత్వం ఇదే సమయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విధాన నిర్ణయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ఎటువంటి పాత్ర ఉండదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆ ముగ్గురికి అవకాశం ఖాయంగా..
అయితే, గత పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఈ సారి సైతం అదే హోదాలో కొనసాగనున్నారు. తిరుపతి స్థానిక ఎమ్మెల్యేగా భూమన..తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డికి ఈ అవకాశం దక్కనుంది. అదే విధంగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న విశాఖకు చెందిన సుధాకర్ సైతం ఈ సారి ఎక్స్ అఫీషియో కోటాలో బోర్డు సభ్యుడుగా ఉండనున్నారు.

జగన్ ఫైనల్ గా.. రేపు ఉత్తర్వులు
ఇప్పటికే దాదాపు కసరత్తు పూర్తి చేసినా..చివరి నిమిషంలో వస్తున్న వినతులతో రేపు లేదా గురువాతం టీటీడీ కొత్త బోర్డు జాబితా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. దీంతో..ఆశావాహులు తమ చివరి ప్రయత్నాలు ముమ్మరం చేసారు. చివరి నిమిషంలో మార్పులు - చేర్పులు లేకుంటే 75 మంది సభ్యులతో టీటీడీ నూతన బోర్డు ఏర్పాటు కానుంది.












Click it and Unblock the Notifications