వెనుకబడిన ప్రాంతాల్లో రెండు వేల ఆలయాల నిర్మాణం - టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి..!!
ధర్మ ప్రచారంలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు గిరిజన, మత్స్యకార, దళితవాడల్లో ఈ ఆలయాల నిర్మాణం ప్రారంభించామన్నారు. గడిచిన నాలుగేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో సుమారు 2 వేల ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. గిరిజన, మత్స్యకార, దళితవాడల్లో ఆలయ నిర్మాణాలు చేపట్టామని సుబ్బారెడ్డి వెల్లడించారు.
మన్యం జిల్లా సీతంపేటలో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకోలేని భక్తుల కోసం గడిచిన నాలుగేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో సుమారు 2 వేల ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. సీతంపేటలో ఒకటిన్నర సంవత్సరాల అతి తక్కువ వ్యవధిలో దాదాపు రూ.10 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఆలయం వద్ద నిర్మించిన కల్యాణ మండపాన్ని మరింతగా విస్తరించి, చుట్టుపక్కల గిరిజన భక్తులు ఉచితంగా శుభకార్యాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.

మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరంలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు నూతన ఆలయం మహా సంప్రోక్షణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతమైన కురుపాంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నులకు రవాణా, వసతి, ఆహారం ఉచితంగా కల్పించి తిరుమల బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనం ఉచితంగా చేయిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాల నుంచి స్వామివారి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో వేలాది మంది శ్రీవారి సేవకులు తిరుమలకు విచ్చేసి తోటి భక్తులకు సేవ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. వీరందరికీ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల నుండి మరింతమంది శ్రీవారి సేవకులుగా భక్తులకు సేవలు అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications