బాబాయ్ కోరికను జగన్ ఆమోదిస్తారా : టీటీడీ కొత్త ఛైర్మన్ ఎవరు: ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు...!!
ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నియమించుకున్న సలహాదారులకు తొలుత రెండేళ్ల కాల పరమితితో ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా వారికి మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఛైర్మెన్గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల అంటే జూన్తో ముగియనుంది. మరి జగన్ ఆయన్నే కొనసాగిస్తారా లేక మరెవరికైనా ఛాన్స్ ఇస్తారా అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది.
ముగియనున్న వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం
ఏపీలో కొందరు కోరుకొనేది...ప్రతిష్ఠాత్మకంగా భావించేది టీటీడీ ఛైర్మన్ హోదా. 2019 ఎన్నికల సమయంలో అప్పటికే ఒంగోలు ఎంపీగా ఉంటూ..ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన సీఎం జగన్ బాబాయ్ సుబ్బారెడ్డికి తిరిగి ఎంపీ సీటు కాదని..టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన మాగంటి శ్రీనివాసులరెడ్డికి కేటాయించారు. దాంతో..అప్పట్లోనే బాబాయ్ కినుక వహించారు. దీంతో..అధికారంలోకి రాగానే టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తాననే జగన్ హామీతో మెత్తబడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పినట్లుగా సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవిని ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2019 జూన్ 21న టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ నెల 21వ తేదీతో రెండేళ్లు పూర్తవుతుంది. అయితే, ఈ రెండేళ్ల కాలంలోనే ఎన్నో వివాదాలు... మరెన్నో ఆరోపణలకు సుబ్బారెడ్డి సమాధానం చెప్పాల్సి వచ్చింది. టీటీడీ కేంద్రంగా రాష్ట్ర రాజకీయం చాలా సందర్భాల్లో చోటు చేసుకుంది.
రాజ్యసభ సీటుపై వైవీ సుబ్బారెడ్డి ఆశలు
ఇక, ఇప్పుడు సుబ్బారెడ్డి పదవి రెండేళ్లు పూర్తి కానుండటంతో సీఎం జగన్ ఏం చేస్తారు. ఆయన్నే కంటిన్యూ చేస్తారా..లేక మరొకరికి అవకాశం ఇస్తారా అనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే, సుబ్బారెడ్డి మాత్రం పెద్దల సభకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి కొద్ది రోజుల్లో రాజ్యసభలో వైసీపీకి మూడు సీట్లు దక్కనున్నాయి. పక్కా సామాజిక సమీకరణాలు పాటించే జగన్...తన బాబాయ్ కు ఎటువంటి హామీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక, బాబాయ్ స్థానం భర్తీ చేసేది ఎవరు అనేది ఇప్పుడు చర్చ. పార్టీలో పలువురు సీనియర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ సారి రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఈ పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం. కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధ రెడ్డి పేరు 2019లోనే టీటీడీ ఛైర్మన్ గా పరిశీలనకు వచ్చింది. అయితే, సుబ్బారెడ్డికి హమీ ఇచ్చి ఉండటంతో సాధ్య పడలేదు. ఆయన టీడీపీ నుండి వచ్చిన మల్లిఖార్జున రెడ్డి కోసం తన సీటు త్యాగం చేసారు. కానీ, ఆయనకు కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టీటీడీ ఛైర్మెన్గా భూమన కరుణాకర్ రెడ్డి..?
దీంతో.. వైఎస్సార్ హాయంలో టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేరు తెర పైకి వచ్చింది. ఆయన హాయంలోనే దళిత గోవిందం, కళ్యాణమస్తు వంటివి నిర్వహించారు. అయితే, ఆయనకు ఆ పదవి ఇవ్వటం పైనా అప్పట్లో విమర్శలు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో తొలి నుండి జగన్ కుటుంబంతోనే ఉన్న కరుణాకర రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం జిల్లా సమీకరణాల్లో సాధ్యం కాదు. దీంతో..ఆయనకు ఇష్టమైన టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. అయితే, సామాజిక సమీకరణాల పరంగా చూస్తూ ఇప్పటి వరకు సుబ్బారెడ్డి..తిరిగి అదే వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వటం అనేది సాధ్యపడుతుందా అనే సందేహం కూడా వ్యక్తం అవుతోంది. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన క్షత్రియ వర్గానికి చెందిన ఒక నేత సైతం పోటీలో ఉన్నారు. ఆయన కుటుంబానికి బీజేపీ నేతలతోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. బీసీ వర్గానికి ఇవ్వాలని భావిస్తే గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ కు దక్కుతుందని చెబుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్ టీటీడీ నూతన ఛైర్మన్ నియామకం పైన నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం.