మరో వివాదంలో టిటిడి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు....
టిటిడి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన కుమారుల బదిలీ విషయమై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి అభిషేకాలు, కైంకర్య కార్యక్రమాలను రమణ దీక్షితులతో పాటు ఆయన ఇద్దరి కుమారులు చూస్తున్నారు. అయితే వీరు నిబంధనల ప్రకారం టిటిడి ఉద్యోగులు కారు.
ఆగమ శాస్త్రాన్ని అనుసరించి స్వామివారికి సేవ చేయడమే వీరి పని. ఎంతో నిబద్ధతతో ఈ పని చేయాల్సివుండగా రమణ దీక్షితులు ఇద్దరు కుమారులు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం సమస్యలను తెచ్చిపెడుతోందట. ఇదేవిషయమై టిటిడి గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా లెక్కచెయ్యకుండా విధులకు గైర్హాజరవుతూనే ఉన్నారని అంటున్నారు. దీంతో విసిగిపోయిన టిటిడి ఉన్నతాధికారులు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి రమణ దీక్షితులు కుమారులు ఇద్దరినీ బదిలీ చేశారు.
కుమారుల బదిలీపై ఆగ్రహం..
ఈ బదిలీ వ్యవహారం ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన కుమారులు నిబంధనల ప్రకారం టిటిడి ఉద్యోగులు కారని, అలాంటప్పుడు ఇలా బదిలీ చేసే అధికారం టిటిడికి ఎక్కడిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. అసలు మీరెవరు మమ్మల్ని బదిలీ చేయడానికి, ఇక్కడ మాదే సర్వాధికారం, ఆలయం బయట వరకే మీ అధికారం పరిధి, అంతవరకు మీరు ఏం చేయాలన్నా చేసుకోండి, ఆలయంలో ఏం చెయ్యాలన్నా నిర్ణయాలు మావే అన్నారని ప్రచారం జరుగుతోంది. అసలు స్వామివారి మూల విరాట్ మాదేనని రమణ దీక్షితులు అన్నారంటూ జరుగుతున్న ప్రచారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడు ఈ విధంగా మాట్లాడటం కలకలం రేపిందట. అయితే రమణ దీక్షితుల వ్యాఖ్యలపై టిటిడి ఉన్నతాధికారులు స్పందించేందుకు నిరాకరించారట.
పలుసార్లు వివాదాల్లో...
అయితే టిటిడి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివాదాల్లో చిక్కుకోవడం పరిపాటే అంటున్నారు ఆయనను వ్యతిరేకించేవారు. గతంలో కూడా పలుసార్లు రమణ దీక్షితులు వివాదాస్పద వైఖరితో వార్తల్లోకి ఎక్కిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయినా ఆయన కుమారులు అత్యంత పవిత్రమైన స్వామివారి విధులకు హాజరు కాకపోయినా రమణదీక్షితులు వారిని వెనెకేసుకొస్తూ టిటిడి నిబంధనలను లెక్కచెయ్యడం లేదని ,దీనివల్ల మిగిలినవారితో అనేక ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. తాజా వివాదానికి కారణం ఆరు నెలలుగా రమణ దీక్షితులు కుమారులు రాజేష్, వెంకటపతి దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో విధులకు హాజరు కాకపోవడమేనని తెలిసింది.