శ్రీవారి లడ్డూ తయారీపై ఆ ప్రచారం- హెచ్చరించిన టీటీడీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 69,029 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,547 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.90 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

శ్రీవారి అన్న ప్రసాదాల తయారీలో మరింత నాణ్యతను తీసుకుని రావడానికి టీటీడీ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అన్న ప్రసాదం, లడ్డూ తయారీని స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు. నెయ్యి మొదలుకుని అన్నిరకాల ఆహార వస్తువులను వినియోగించేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు.
అదే సమయంలో- శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తయారీని అన్యమతస్తులకు అప్పగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడం పట్ల టీటీడీ తీవ్రంగా స్పందించింది. ఈ వార్తలను తోసిపుచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీపై నిరాధారమైన అవాస్తవాలు, అసత్యాలను ప్రచారం చేస్తోన్నారంటూ పేర్కొంది.
సోషల్ మీడియా ద్వారా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీవైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నారని గుర్తు చేసింది. తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన కార్మికులు విధులను నిర్వహిస్తున్నారని తెలిపింది.
ఈ 980 మందిలో లడ్డూల తయారీ, ముడి సరుకులను తీసుకురావడం వంటి పనులను శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు చేస్తారని టీటీడీ వివరించింది. ఇతరలు, లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడి పోటు, లడ్డు కౌంటర్లలో విధుల్లో ఉంటోన్నారని పేర్కొంది. శ్రీవారి లడ్డు ప్రసాదాలను థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారనడం అసత్యమని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications