తిరుమల భక్తులకు ఈవో ధర్మారెడ్డి కీలక సూచన..!!
టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల భక్తులకు కీలక సూచన చేసారు. భక్తులకు అందిస్తున్న సేవలను వివరించారు.
Tirumala: తిరుమల పుణ్యక్షేత్రంల.జనవరిలో వరుస పర్వదినాలు..సెలవులతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఒక్క జనవరి మాసంలోనే 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే విధంగా రధసప్తమి రోజున శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. రోజు హుండీ ఆదాయం 2వ తేదీన రూ 7.68 కోట్లు వచ్చింది. ఇక, వరుస పర్వదినాలతో శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య భారీ స్థాయిలో ఉంది. రధసప్తమి నాడు శ్రీవారు సప్తవాహనం పైన తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ సమయంలో శ్రీవారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రధ సప్తమి నాడు శ్రీవారిని అత్యధికంగా 80,094 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్న ట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక గత మార్చి నుంచి వరుసగా ప్రతీ నెల శ్రీవారి ఆదాయం వంద కోట్లు దాటినట్లు అధికారులు గణాంకాలు విడుదల చేసారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి డయల్ యువర్ ఈవో కార్యక్రమంతో అందుబాటులోకి వచ్చారు. జనవరి నెలలో తిరుమలలో జరిగిన విశేష పర్వదినాలు..భక్తుల రద్దీ..టీటీడీ ఏర్పాట్ల గురించి వివరించారు. జనవరి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.123 కోట్లుగా వెల్లడించారు. అదే సమయంలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7.51 లక్షలు కాగా అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తులు 37.38 లక్షలని తెలిపారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించినట్లుగా చెప్పారు. ఇదే సమయంలో కొందరి భక్తులు ఈవోకు ఫిర్యాదులు కూడా చేసారు. కొందరు అర్చకులు, క్షురకులు భక్తులను డబ్బులు అడుగుతున్నారని తమకు ఫిర్యాదు వచ్చాయని ఈ విషయంపై దృష్టి సారిస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుందని వెల్లడించారు. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత శ్రీ మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించినట్లు చెప్పారు.
ఇదే సమయంలో టీటీడీ ఈవో కీలక సూచన చేసారు. తిరుమలలో పుష్పాలు శ్రీవారికే అంకితమని చెప్పారు. తిరుమలలో మహిళలు పుష్పాలు ధరించకూడదని ఈవో ధర్మారెడ్డి శ్రీవారి భక్తులను కోరారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియం ను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి చెప్పుకొచ్చారు. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన TTDevasthanams యాప్ కు భారీ స్పందన కనిపిస్తోంది. అనూహ్య స్థాయిలో భక్తులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా తిరుమలలో డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈవో వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు.