శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 75,963 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,956 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.99 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ప్రతి రోజు వేల సంఖ్యలో తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాని కల్పించడంలో అధిక ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావు చెప్పారు. వారికి మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోన్నామని, తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో రాజీపడబోమని అన్నారు.
తాను బాధ్యతను స్వీకరించిన తరువాత తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు శ్యామలరావు చెప్పారు. వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు రెండు లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.
అన్న ప్రసాదాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని, సభ్యులు సూచించిన విధంగా భవనంలో సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను మరింత మెరుగుపర్చామని అన్నారు.
అన్న ప్రసాదాలలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను మరింత పెంపొందించడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సహకారంతో అత్యాధునిక ల్యాబొరేటరీని తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు శ్యామలరావు వెల్లడించారు. ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్లో 80 రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు.

భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూలైన్ల వద్ద 6,000 మంది వేచి ఉండేలా కొత్త షెడ్ ఏర్పాటు చేసినట్లు శ్యామలరావు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరివేక్షించేలా ప్రత్యేకంగా ముగ్గురు ఏఈఓలకు బాధ్యతలు అప్పగించామని అన్నారు.
క్యూలైన్లలో మూడు చోట్ల అన్నప్రసాదాలు అందించడానికి కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్స్ ప్రకారము నాణ్యమైన నెయ్యి, ముడి సరుకులు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్లో లోపాలను సరిదిద్దుతామని శ్యామలరావు భరోసా ఇచ్చారు. గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న సర్వదర్శనం టోకెన్లను 1.47 లక్షలకు పెంచినట్లు ఆయన చెప్పారు. ఈ టోకెన్ల సంఖ్యను మరింత పెంచడానికి గల అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications