లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా?...కొత్త విషయాలు తెలిశాయి:టీటీడీ ఈవో,ఛైర్మన్
అమరావతి: టిటిడి రికార్డుల్లో ఎక్కడా పింక్ డైమండ్ గురించి లేదని...రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా..? అంటూ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రశ్నించారు. టీటీడీ వివాదం నేపథ్యంలో ఛైర్మన్ తో కలసి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అనంతరం ఆయన సిఎంతో సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాదం నేపథ్యంలో అన్ని విషయాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వెల్లడించినట్లు సింఘాల్ తెలిపారు. తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు పదే పదే సూచించారని ఈవో ఈవో అవోక్ సింఘాల్ చెప్పారు. 1952 నుంచి శ్రీవారి ఆభరణాల రికార్డులు ఉన్నాయని తమ వద్ద ఉన్నాయన్నారు.
శ్రీవారి నగలన్నీ...భద్రం
శ్రీవారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని రిటైర్డ్ జడ్జిల కమిటీ తేల్చిన విషయాన్ని ఈవో ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాలు ఏవో ఆ కమిటీ తేల్చలేకపోయిందని ఈవో సింఘాల్ చెప్పారు. ప్రతి ఏడాది ఆభరణాల తనిఖీ జరుగుతుందని, ఒక్క మిల్లీ గ్రాము అటూ ఇటైనా ఆ విషయం రికార్డుల్లోకి వస్తుందని ఈవో వెల్లడించారు. గరుడసేవలో వచ్చింది పింక్ డైమండ్ కాదని, కెంపు మాత్రమేనని సింఘాల్ స్పష్టం చేశారు.
ఒప్పుకుంటే...ప్రదర్శన
భక్తులు విసిరిన నాణేలకు కెంపు పగిలిపోయిందని, అప్పటి ఈవో ఐవైఆర్ కెంపు పగిలిపోయిందని నివేదిక ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ గుర్తు చేశారు. శ్రీవారి ఆభరణాల జాబితా ఇప్పటికే ఇచ్చామని, ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలను ప్రదర్శిస్తామని ఈవో సింఘాల్ స్పష్టం చేశారు.శ్రీవారికి వచ్చే నిధులన్నింటినీ తాము సక్రమంగా వినియోగిస్తున్నామన్నారు. స్వామి వారి నిధులను ఏ విధంగానూ దుర్వినియోగం చేయడం లేదని చెప్పారు. శ్రీవారికి జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
కొత్త విషయాలు...నిన్నా,మొన్నా
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న, మొన్న కొన్ని కొత్త విషయాలు బయటికి వచ్చాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. టిటిడికి సంబంధించి అన్ని అంశాలపై చట్టపరంగానే ముందుకెళ్తామని అన్నారు. గతంలో మాదిరిగానే కైంకర్యాలు జరుగుతున్నాయని, ఆలయంలో మరమ్మతులు జరుగుతూనే ఉంటాయని సింఘాల్ పేర్కొన్నారు. వంటకు ఆవసరమైన ఏర్పాట్లే తప్ప శ్రీవారి పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు.
లేని వజ్రం...ఎలా తేవాలి?
ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుడా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించినట్లు టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఇటీవల జెనీవాలో వేలం వేసిన గులాజీ రంగు వజ్రం శ్రీవారిదేనంటూ రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేయడంపై స్పందించారు.‘‘శ్రీవారి ఆభరణాల రికార్డుల్లో గులాబీ వజ్రం అనేది లేనేలేదు. రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా? ఎక్కడి నుంచి తెస్తాం? అసలు రమణదీక్షితులు ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?'' అని టీటీడీ చైర్మన్ ప్రశ్నించారు.