అరుదైన కానుకలు సమర్పించిన టీటీడీ
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 67,284 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,268 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు గరుడ వాహనంపై ఊరేగారు. సాయంత్రం 7 నుండి రాత్రి 10 గంటల వరకు గోవిందరాజులవారు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ అతి ముఖ్యమైనదిగా భావిస్తారు భక్తులు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలుగా విశ్వసిస్తారు.
గరుడసేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా సుమారు 34.46 లక్షల రూపాయల విలువైన మూడు ఆభరణాలను టీటీడీ సమర్పించింది. తొలుత తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తిరుపతిలోని శ్రీఎదురు ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఈ ఆభరణాలను ఊరేగింపుగా గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం వాటిని అలంకరించారు. గరుడసేవలో ఈ ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అంతకుముందు స్వామివారికి నూతన వస్త్రాలు, తిరువడి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ ఊరేగింపు తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుండి బజార్ వీధి, సన్నిధి వీధి నుండి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకున్నాయి. ఏనుగులు, గుర్రాలు, నృత్య బృందాలు-, కోలాటం కళాకారుల ప్రదర్శనతో వాహన ఊరేగింపు శోభను రెట్టింపు చేశాయి.












Click it and Unblock the Notifications