TTD: ఈ నెలలో మూడు రోజులు సర్వదర్శన టోకెన్లు రద్దు..!!
Tirumala: తిరుమలలో రధసప్తమిని మినీ బ్రహ్మోత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకే రోజున శ్రీవారు ఏడు వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రథసప్తమిని పురస్కరించుకొని ఆర్జిత సేవలను రద్దు చేసారు. అదే విధంగా ఫిబ్రవరి 15, 16, 17వ తేదీల్లో ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు.
రధసప్తమి వేడుకలు: ఈ నెల 16న రథసప్తమి పర్వదినానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

రధసప్తమి నాడు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు తిరుమలలో ఏడు వాహనాలపై స్వామివారి ఉరేగింపును తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాధిపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులు చలికి, ఎండకు ఇబ్బంది పడకుండా మాడ వీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయలన్నారు.
భక్తులకు ఏర్పాట్లు: భక్తుల సౌకర్యార్థం 3.5 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని పోటు అధికారులకు ఈవో సూచించారు. అన్నప్రసాదం అధికారులు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.
భక్తుల దాహార్తిని తీర్చడానికి శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు.

ఆర్జిత సేవలు రద్దు: రథసప్తమి సందర్భంగా వివిధ రకాల ఫలపుష్పాలతో, పచ్చని తోరణాలతో, అందమైన అరటి చెట్లతో పందిళ్ళను ఏర్పాటు చేసి తిరుమాడ వీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన విభాగం అధికారుల ఈవో ఆదేశించారు. ఆ రోజున ఎటువంటి ప్రత్యేక దర్శనాలు (విఐపి బ్రేక్, వయోవృద్ధులు, వికలాంగులు మరియు చంటిపిల్లల తల్లిదండ్రులకు) ఉండవని చెప్పారు.
అదే విధంగా ఫిబ్రవరి 14వ తేదీ తెల్లవారు జామున 12 గంటల నుండి 16వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు టిబి, ఎంబిసి - 34 కౌంటర్లను మూసివేసి, సిఆర్వో, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనాల సమూదాయంలో మాత్రమే గదులు కేటాయించాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ భద్రతా విభాగం మరియు పోలీసు అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు.












Click it and Unblock the Notifications