భక్తులకు గుడ్ న్యూస్: టీటీడీ కౌంటర్లు ప్రారంభం
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 67,284 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,268 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్లు చేసింది.
శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. త్వరలోనే శ్రీనివాస మంగాపురం ఆలయంలో కూడా కౌంటర్లను ఏర్పాటు చేయడానికి భారత పురావస్తు శాఖ నుంచి అనుమతిని తీసుకోనుంది.
భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. అన్ని కౌంటర్ల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం భక్తులతో మాట్లాడారు. టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏఎస్ఐ నుంచి అనుమతులు రావడానికి కొంత సమయం పడుతుందని, భక్తుల సౌకర్యార్థం టోకెన్ కౌంటర్లను తాత్కాలికంగా భూదేవి కాంప్లెక్స్కు మార్చామని పేర్కొన్నారు. భూదేవి కాంప్లెక్స్ లో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎస్ఎస్డీ టోకెన్లను జారీ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అందుకే ఆ కౌంటర్లను ఇక్కడికి మార్చినట్లు వివరించారు.
శ్రీవారి మెట్టు డీడీ టోకెన్లను జారీ చేయడానికి నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని, టీటీడీ ఏర్పాట్లపై భక్తులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారని అన్నారు. బస్టాండ్ కూడా అలిపిరిలోనే ఉండటం వల్ల రవాణా వ్యవస్థ భక్తులకు అందుబాటులో ఉందని చెప్పారు. భక్తులు శ్రీవారి మెట్టు చేరుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications