టీటీడీలో ప్రక్షాళన: అన్యమతస్తులకు చెక్
Dial Your EO: టీటీడీలో మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో జే శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీటీడీ ఈవో వెల్లడించారు.
టీటీడీ పట్టణ ప్రణాళిక శాఖ..
తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ పట్టణ ప్రణాళిక శాఖను ఏర్పాటు చేశామని శ్యామలరావు తెలిపారు. ఇందులో పలు పోస్టుల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని వివరించారు. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్ఛర్ కన్సెల్టెన్సీల ద్వారా టీటీడీలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

మొదటి దశలో..
మొదటి దశలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.
75 ఆధ్యాత్మిక పేర్లు
తిరుమలలోని 45 విశ్రాంత భవనాల పేర్లు మార్పునకు 75 ఆధ్యాత్మిక పేర్లను ఎంపిక చేశామని, ఇందులో 42 మంది టీటీడీ సూచించిన పేర్లను మార్పు చేశారని అన్నారు. ఇదివరకే 33 కాటేజీలకు వివిధ దేవతల పేర్లు ఉన్నాయని గుర్తుచేశారు. మిగిలిన రెండు విశ్రాంతి గృహాలు స్పందించలేదని, దీంతో వాటి పేర్లను తామే మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు.
టీటీడీలో ప్రక్షాళన
టీటీడీలో ప్రక్షాళన చేపట్టామని, భక్తులకు దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదంలో సమూల మార్పులు తీసుకొచ్చామని, తిరుమల అటవీ ప్రాంతంలో 68 శాతం నుండి 80 శాతానికి పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టామని శ్యామలరావు పేర్కొన్నారు.
శ్రీవారి వైభవం విశ్వవ్యాప్తం
శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, ఇందులో భాగంగా ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం జరిగిందని అన్నారు.
29 మంది అన్యమత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ
ఇటీవల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ మిగిలిన నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 15 రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశామని చెప్పారు. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. టీటీడీ తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రకారం అన్యమతస్తులపై చర్యలు చేపట్టామని, ఇప్పటికే 29 మంది అన్యమత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని అన్నారు.
జనతా క్యాంటీన్లు..
ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దుచేసి, అయిదుమంది సభ్యులతో కొత్త కమిటీని టీటీడీ నియమించిందని అన్నారు. భక్తులకు మరింత నాణ్యంగా, రుచికరంగా ఆహార పదార్థాలు అందించేందుకు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను ప్రముఖ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించామని, త్వరలోనే టెండర్లను పిలుస్తామని శ్యామలరావు చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానంతో..
సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మరింత పారదర్శకంగా, సులభతరంగా, త్వరితగతిన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఎఫ్ఎంఎస్ మానిటరింగ్, వాట్సప్ గవర్నెన్స్, గూగుల్ తో ఒప్పందం, ఆధార్ నమోదు, కియోస్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని శ్యామలరావు చెప్పారు.
వాట్సాప్ ఫీడ్ బ్యాక్..
భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఫీడ్ బ్యాక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ విధానం ద్వారా పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు.
తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ
తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెల్లిన వసతి గృహాల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. టీటీడీ భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని, తిరుమలలో 12,000 చదరపు అడుగుల స్థలంలో ఈ ల్యాబ్ ఏర్పాటు అవుతుందని వివరించారు.












Click it and Unblock the Notifications