Tirumala : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు..!!
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. కొత్త సంవత్సరం..ముక్కోటి రద్దీ కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా 27న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో రేపు 26న సిఫార్సు లేఖలు అనుమతించమని స్పష్టం చేసింది. 27న ఉదయం 6 గంటల నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు ఆలయం శుద్ది చేయనున్నారు. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసారు.

జనవరి 1..ముక్కోటి రద్దీ
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 14 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 71528 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ 3.81 కోట్లు శ్రీవారికి హుండీ ఆదాయం వచ్చింది.
టోకెన్ లేని భక్తుల సర్వ దర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. జనవరి 1న తిరుమలలో ప్రోటోకాల్ జాబితాలో ఉన్న వారికి మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. ఆ రోజు ఉండే భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, జనవరి 2వ తేదీ ముక్కోటి కావటంతో ఆ రోజు ప్రముఖుల రాక ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు
జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా జారీ చేసారు. రోజుకు 20 వేల మందికి అవకాశం కల్పించేందుకు టికెట్లు అందుబాటులో ఉంచగా, కేవలం 44 నిమిషాల్లో అన్ని టికెట్లు అయిపోయాయి.తిరిగి జనవరి 1వ తేదీ నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన తొమ్మది ప్రత్యేక కౌంటర్ల ద్వారా శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు జారీ చేయనున్నారు.
టికెట్లు ఉన్న వారికే శ్రీవారి దర్శనం ఉంటుందని ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసింది. జనవరి 1, ముక్కోటి రోజుల్లో ప్రివిలేజ్ దర్శనాలను పరిమితం చేస్తున్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. గతంలో ముక్కోటి, వైకుంఠ ద్వార దర్శనం సమయంలో అనుసరించిన విధానాలనే కొనసాగిస్తూనే..మరి కొంత మంది సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం అవకాశం కల్పించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది.

ఆ సర్టిఫికెట్ తో రావాలని సూచన
ఇదే సమయంలో భక్తులకు కీలక సూచనలు చేసింది. కరోనా సబ్ వేరియంట్ పైన కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. అందులో భాగంగా తిరుమలకు వచ్చే భక్తులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తో రావాలని టీటీడీ సూచిస్తోంది. వ్యాక్సినేషన్ చేయించుకోని వారు కరోనా ఫ్రీ నిర్దారణ పత్రంతో రావాలని సూచించింది. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం తో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ నుంచి సంక్రాంతి వరకు తిరుమలలో రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తన్నాయి.












Click it and Unblock the Notifications