తిరుమలలో భక్తులు ఆ పనులు మానుకోవాలి- ప్రతిజ్ఞ చేయించిన టీటీడీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. శుక్రవారం నాడు 58,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,360 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగళా వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలలో భక్తులు తాము ప్రయాణం చేసే వాహనాల నుండి రోడ్లపై చెత్తను విసరడం మానుకోవాలని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ ఆంధ-స్వచ్ఛ తిరుమలలో భాగంగా శనివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్లోని కుంకాల పాయింట్ వద్ద ఆయన సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ వాహనదారులు ప్లాస్టిక్ కవర్లు, తిను బండారాలు, వాటర్ బాటిళ్లను తీసుకొచ్చి రోడ్ల పక్కన విసిరి వేస్తోన్నారని చెప్పారు. దీంతో కొంతకాలంగా పెద్ద ఎత్తున చెత్త పోగయ్యిందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమలలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డులో ఈ చెత్తను తొలగించాలని నిర్ణయించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో 400 మంది టీటీడీ సిబ్బందితో పాటు పోలీసులు, తిరుమల స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారని చెప్పారు. చెత్తను శుభ్రం చేయడంతో పాటు భవిష్యత్తులో రోడ్డుపై చెత్త విసరకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
భక్తులందరూ ఆ డస్ట్ బిన్లలో చెత్త వేయాలి తప్ప వాహనంలో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త విసరడం మంచి పద్ధతి కాదని అన్నారు. తిరుమలను పరిశుభ్రంగా ఉంచడానికి 6,000 మంది సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తోన్నారని చెప్పారు. వారి కృషిని, తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాల నుండి బయటకు చెత్త విసరడం మానుకోవాలని కోరారు.
భక్తులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని, స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి సహకరించాలని కోరారు. అనంతరం ఆయన ఈ సందర్బంగా దిగువ ఘాట్ మార్గంలో ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త తొలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications