ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏపీ, తెలంగాణాలలో టీటీడీ "మన గుడి" కార్తీక మాస కార్యక్రమాలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 'మన గుడి' ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. కార్తీక మాసం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మన గుడి కార్యక్రమం
ఈ కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎంపిక చేసిన శివాలయాలలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాలలో ఏడు రోజులపాటు కార్తీకమాస విశిష్టత పైన ధార్మిక ఉపన్యాసాలు నిర్వహించనున్నట్టు టిటిడి అధికారులు తెలిపారు.

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మనగుడి కార్యక్రమాలు
అంతేకాదు ఒక్కో జిల్లాలో రెండు శివాలయాలను ఎంపిక చేసి నవంబర్ 13వ తేదీన కైశిక ద్వాదశ పర్వదిన కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాలలో నవంబర్ 15వ తేదీన కార్తీక దీపోత్సవాన్ని జరపనున్నట్టు వెల్లడించారు.పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తిరుమల కపిలేశ్వరాలయంలో కార్తీక విశేష పూజలు
ఇదిలా ఉంటే పవిత్రమైన కార్తీక మాసంలో తిరుమలలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబరు ఒకటవ తేదీ వరకు నెల రోజుల పాటు విశేష పూజలు, హోమ మహోత్సవాలు జరుగుతున్నాయని కూడా టీటీడీ పేర్కొంది . ఇక నేటి నుంచి ఏడవ తేది వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం కపిలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
భక్తుల నుండి విశేష ఆదరణ
కాగా నవంబరు 2 నుంచి 4వ తేదీ వరకు శ్రీగణపతిస్వామివారి హోమం జరిగింది. టిటిడి నిర్వహిస్తున్న కపిలేశ్వర ఆలయంలోని హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. 2012 వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ హోమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications