TTD: శ్రీవారి ఆలయంలో రేపు అరుదైన ఘట్టం, మహా యజ్ఞంలా - బ్రేక్ దర్శనం రద్దు..!!
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రేక్ దర్శనంతో పాటుగా సేవలను రద్దు చేసారు. ఇక, బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన టీటీడీ.. పలు సూచనలు చేసింది.
ఏర్పాట్లు
తిరుమలలో శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చైర్మన్ బీఆర్ నాయుడు తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యుత్ అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తిరుమలలో 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.

అరుదైన ఘట్టం
ఇక, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం. ఈ శుద్ధి జరుగుతున్న సమయం లో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన "పరిమళం" అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల ఇతర పరివార దేవతలు, దీపం మరియు పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు.
బ్రేక్ రద్దు
ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. కాగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. దీంతో, టీటీడీ సెప్టెంబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను (ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా) రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేసారు.












Click it and Unblock the Notifications