టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలనం: ఉద్యోగుల కోసం కొత్తగా.. !!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 67,284 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,064 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఒక కంపార్టుమెంట్ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

టీటీడీ కొత్తగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగులందరికీ నేమ్ బ్యాడ్జీలను అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కూడా నేమ్ బ్యాడ్జీల వ్యవస్థ టీటీడీలోలేదు. కొత్తగా దీన్ని ప్రవేశపెట్టనుంది టీటీడీ. ఒక్క తిరుమలలో మాత్రమే కాకుండా టీటీడీ పాలక మండలి పరిధిలోకి వచ్చే విభాగాలన్నింట్లో పని చేసే ప్రతి ఒక్క ఉద్యోగికీ ఈ బ్యాడ్జీలు అందుతాయి. దీనికి అవసరమైన కసరత్తు త్వరలోనే మొదలు పెట్టనుంది టీటీడీ.
ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే అశేష భక్తుల పట్ల కొందరు ఉద్యోగులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని గుర్తించడానికి, వారి పేర్లు భక్తులకు తెలిసేలా చేయడానికి నేమ్ బ్యాడ్జీలను అందిస్తామని అన్నారు.
ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యల తీసుకోవడానికి వెనుకాడబోనని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఈ నేమ్ బ్యాడ్జ్ ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు.
శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రతి ఒక్క ఉద్యోగి, సిబ్బందికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేమ్ బ్యాడ్జీ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగులు మళ్లీ అంకితభావంతో ప్రవర్తించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి ఈ నేమ్ బ్యాడ్జ్ త్వరలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications