తిరుమల క్యూ లైన్లల్లో ఇకపై..
Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిర్దేశించిన సమయానికి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది.
దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ పై టీసీఎస్ ప్రతినిధులతో టీటీడీ కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వర్చువల్ గా ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా టీసీఎస్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం, ఎస్ఎస్డీ, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం వంటి టోకెన్లు/టికెట్ల ద్వారా వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారని, ఎటువంటి జాప్యం లేకుండా టెక్నాలజీ సాయంతో వారికి సకాలంలో దర్శనం చేయించాల్సిన అవసరం ఉందని అన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా- భక్తులు శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో చేరినప్పటి నుండి దర్శనం అయ్యే వరకు టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉందని, శ్రీవారి దర్శనం సులభతరం చేయించే అంశానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని ఈఓ అన్నారు.
ఈ క్రమంలో క్యూఆర్ కోడ్, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా భక్తులను ధృవీకరించాలని నిర్ణయించుకున్నట్లు శ్యామలరావు తెలిపారు. దీనివల్ల స్వామివారి దర్శన సమయం మరింత తగ్గుతుందని అన్నారు. క్యూఆర్ కోడ్, ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఈవో కోరారు.
అదే విధంగా కేటాయించిన సమయానికి అనుగుణంగా భక్తులు స్వామివారి దర్శనానికి రాకపోవడం వల్ల మరింత ఆలస్యం అవుతోందని, భక్తులను నిర్దేశించిన సమయానికి వారికి కేచాయించిన ప్రాంతానికి వచ్చేలా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. భక్తులు క్యూలైన్లలో ప్రవేశించినప్పటి నుండి దర్శనం ముగిసేంత వరకు ఎంత సమయం పడుతోందనేది రియల్ టైమ్ ద్వారా అధ్యయనం చేయాలని సూచించారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లల్లో ఎంత సేపు ఉంటున్నారు? క్యూలైన్లలో భక్తులు చేరినప్పటి నుండి శ్రీవారి దర్శనానికి ఎంత సమయం అవుతోంది? అనంతరం ఆలయం నుండి వెలుపలికి రావడానికి ఎంత సమయం పడుతోంది? అనే విషయాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీసీఎస్ ప్రతినిధులు వివరించారు.












Click it and Unblock the Notifications