కారణమిదే: టిటిడిలో 240 కాంట్రాక్టు క్షురకుల తొలగింపు
టిటిడిలో పనిచేస్తున్న 240 మంది కాంట్రాక్టు క్షురకులను తొలగించారు.భక్తుల నుండి లంచాలు తీసుకొంటున్నారనే ఆరోపణలపై టిటిడి ఈ నిర్ణయం తీసుకొంది.
తిరుమల: కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న 240 మంది క్షురకులను టిటిడి తొలగిస్తూ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.భక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో 240 మంది కాంట్రాక్ట్ క్షురకులను టీటీడీ తొలగించింది.
అయితే ఎటువంటి ఫిర్యాదులు రాకపోయినా తమపై చర్య తీసుకున్నారని క్షురకులు ఆరోపిస్తున్నారు.. బుధవారం ఆలయ జేఈవోను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా క్షురకులపై టీటీడీ చర్యలు తీసుకుందని నాయిబ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న క్షురకులకు టీటీడీ ఎటువంటి జీతాలు చెల్లించదు.
ప్రతి టిక్కెట్పై కొంత మొత్తం మాత్రమే చెల్లిస్తోంది. అయితే భక్తులు స్వచ్ఛందంగా ఇస్తున్న డబ్బులనే క్షురకులు స్వీకరిస్తున్నారని తెలిపారు.తాము భక్తులను ఎటువంటి ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేశారు.
చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించే సమయంలో క్షురకులకు భక్తులు తమకు తోచినరీతిలో సహయం చేస్తారని క్షురకులు వివరించారు. అయితే దీన్ని లంచాలుగా చూడటం తగదన్నారు. టీటీడీ తమకు న్యాయం చేస్తున్న నమ్మకంతో క్షురకులు ఉన్నారురని చెప్పారు. తమ వారికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు నాయిబ్రాహ్మణ సంఘాల నాయకులు వెల్లడించారు.
కళ్యాణకట్టలో ఇప్పటికే క్షురకుల కొరత ఉంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తలనీలాలు ఇచ్చేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కళ్యాణకట్టలో తగిన సంఖ్యలో క్షురకులను నియమించి తమకు ఇక్కట్లు తప్పించాలని టీటీడీని కోరుతున్నారు భక్తులు.












Click it and Unblock the Notifications