శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 21న ఆన్లైన్లో విడుదల
తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవ, అంగ ప్రదక్షిణం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్లైన్లో విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన(రూ. 300) టికెట్లను సెప్టెంబర్ 21న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
నవంబర్ నెలలో శ్రీవారికి నిర్వహించనున్న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవా టికెట్లను సెప్టెంబర్ 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ తెలిపింది. టికెట్ల లభ్యతను బట్టి మొదట వచ్చిన వారికి మదటి ప్రాతిపదికన కేటాయించనున్నట్లు వెల్లడించింది.
నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపంది. అక్టోబర్ నెలకు సంబంధించి పొర్లుదండాలు టోకెన్లను సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
అయితే, అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ తేదీల్లో ప్రదక్షిణం టోకెన్లు జారీ చేయడం లేదని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
ఇది ఇలావుండగా, తిరుమల ఘాట్ రోడ్లో విద్యుత్ బస్సును ఆర్టీసీ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ రవివర్మ, తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి చంగల్ రెడ్డి, తిరుపతి డిపో మేనేజర్ పి. విశ్వనాథ్ పరిశీలించారు.
ఓలెక్ట్రా కంపెనీకి చెందిన అధునాతన విద్యుత్ బస్సును ఆర్టీసీ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. కాగా, తిరుమల ఘాట్ రోడ్ లో ఈ బస్సుల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు ఆర్టీసీ మెకానికల్ ఇంజనీర్ రవివర్మ. విద్యుత్ బస్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఘాట్ రోడ్డు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. తిరుమల తిరుపతిల మధ్య ఈ నెలాఖరికి 10 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.