జగన్ ఢీ అంటే ఢీ: టిడిపి-బిజెపి కూటమికి రెబల్ చిక్కు
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉంటే, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. సీమాంధ్రలోని 175 సీట్లలో ఎక్కువ స్థానాల్లో ద్విముఖ పోటీ కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో కొన్ని స్థానాల్లో మాత్రమే కాంగ్రెసు పార్టీ ప్రధానంగా పోటీలో నిలుస్తోందంటున్నారు. అన్ని పార్టీలకు రెబల్ చిక్కు తప్పడం లేదు.
తిరుగుబాటు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు ఉపపసంహరించుకోని పక్షంలో ఎక్కువగా టిడిపి-బిజెపి కూటమికే దెబ్బ. ఈ కూటమికే ఎక్కువగా రెబల్ దెబ్బ ఉంది. పిసిసి మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్న చీపురుపల్లి నియోజకవర్గం మినహా కోస్తాంధ్రలో మరెక్కడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదంటున్నారు. చీపురుపల్లిలో త్రిముఖ పోటీ ఉంది. కోస్తాంధ్రలో క్షేత్రస్ధాయిలో టిడిపి, బిజెపి ఓట్లు కలిస్తే జగన్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వనుంది.
బిజెపికి కేటాయించిన సంతనూతలపాడు, గుంతకల్లు తదితర అసెంబ్లీ నియోజవర్గాల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో కోస్తాలో విశాఖపట్నం, నరసాపురం, రాయలసీమలో తిరుపతి, రాజంపేట లోకసభ సీట్లలో టిడిపి నుంచి బిజెపికి ఓట్ల బదలాయింపు ఏమేరకు జరుగుతుందనేది తేలాల్సి ఉంది.
విశాఖలో వైయస్ విజయమ్మ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భీమిలి, విశాఖపట్నం నార్త్, అరకు, పాడేరు నియోజకవర్గాల్లో టిడిపి తిరుగుబాటు అభ్యర్ధులు, మాడుగుల అసెంబ్లీలో జగన్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి రంగంలో ఉన్నారు. టిడిపి-బిజెపి కూటమి అభ్యర్థి హరిబాబు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి రూరల్లో టిడిపి రెబల్స్ ఉన్నారు. రాజమండ్రి సిటీ, రూరల్కు టిడిపి నుంచి గోరంట్ల నామినేషన్లు దాఖలు చేయగా, రాజమండ్రి సిటీ బిజెపికి పొత్తులో కేటాయించారు. బుచ్చయ్య రంగంలో నుంచి తప్పుకుంటే తప్ప రాజమండ్రి సిటీలో బిజెపికి లైన్ క్లియర్ కాదు. పశ్చిమ గోదావరిలోను టిడిపి అభ్యర్థులు చాలామంది రెబల్గా నామినేషన్ వేశారు.