కంటతడి: టిడిపికి తుమ్మల రాజీనామా లేఖ, వ్యక్తిగతం
హైదరాబాద్: పార్టీ మారేదీ లేనిదీ వచ్చే నెల 5వ తేదీన చెప్తానని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆయన శనివారంనాడు వచ్చారు. అలా అంటూనే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ రాశారు. టిడిపికి రాజీనామా చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై ఆయన కంటతడి పెట్టారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు కొండబాల, జడ్పీ చైర్పర్సన్ కవిత కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ బలసాని తదితరులు కూడా పార్టీ రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను తుమ్మల నాగేశ్వర రావు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానను అని ఏకవాక్యంతో ఆయన తన రాజీనామా లేఖను పంపించారు.
పార్టీకి తుమ్మల నాగేశ్వర రావు రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని టిడిపి నేత నర్సారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తుమ్మల నాగేశ్వరరావుకు సముచిత స్థానం కల్పించిందని ఆయన శనివారం మీడియాతో అన్నారు,
ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు వాకబు చేశారు. తుమ్మలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్ పర్సన్ తదితరులు పరామర్శించారు. అనారోగ్యంతో ఆయన ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
కాగా, తన క్యాంప్ కార్యాలయంలో తుమ్మల నాగేశ్వర రావు తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మారే విషయంపై ఆయన వారితో చర్చించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారని ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. ఆయన వచ్చే నెల 5వ తేదీన తెరాసలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.
తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో సమావేశమై తెరాసలో చేరే ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఖమ్మం డిల్లాలో టిడిపి నాయకుడు తుమ్మల నాగేశ్వర రావుతో ఆయన చాలా కాలంగా పడడం లేదు.