మంత్రి: తుమ్మలకి కేసీఆర్ డబుల్ ఆఫర్, వ్యూహమే..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో భావిస్తారని భావిస్తున్న మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా సీనియర్ టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర రావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 'డబుల్' ఆఫర్ చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీతో ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని తుమ్మల తెంచుకున్నారు. ఆయన తెరాసలో చేరడం లాంఛనమే అంటున్నారు.
సెప్టెంబర్ 5వ తారీఖున కేసీఆర్ సమక్షంలో అత్యంత ఘనంగా తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమం ద్వారా ఆయన తెరాసలో చేరనున్నారు. సుమారు 2వేల వాహనాల భారీ కాన్వాయ్తో వేలాదిమంది అనుచరులతో ఆయన తెరాసలో చేరనున్నారట.

అయితే, తుమ్మలను తెరాసలోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్ రెండు ఆఫర్లు ఇచ్చారట. ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కూడా కేసీఆర్ ఆయనకు ఆఫర్ చేశారని అంటున్నారు. బడ్జెట్ సమావేశాల్లోపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
ఇక తుమ్మలను ఆహ్వానించడంలో కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఆలోచించారు. ఖమ్మం జిల్లాలో తెరాసకు సరైన క్యాడర్తో పాటు పటిష్టమైన నాయకత్వం కూడా లేదు. ఈ జిల్లాలో ఒక బలమైన నాయకుడి అవసరాన్ని కేసీఆర్ గుర్తించారు. అలాగే, తెలంగాణకు చెందిన కమ్మ సామాజికవర్గ నాయకుడెవరూ తెరాసలో లేరు. ఈ రెండు ప్రయోజనాలను ఆశించి తుమ్మలను కేసీఆర్ తెరాసలోకి ఆహ్వానించారంటున్నారు.
తుమ్మలకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా బలమైన అనుచరవర్గం ఉంది. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబులతో పాటు దాదాపు 15మంది జడ్పీటీసీలు వందలమంది ఎంపీటీసీలు, సర్పంచులు ఆయనతో పాటు తెరాసలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరి రాకతో ఖమ్మం జిల్లాలో తెరాస బలమైన రాజకీయపక్షంగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications