సభలో హరీష్ రావును పట్టేసుకున్న రామారావు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మానం పైన సభలో మూజువాణి ఓటింగ్ పెట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు సభాపతి ముందున్న మైకును విరిచేందుకు విఫలయత్నం చేశారు. సభాపతి ముందున్న టేబుల్ పైకి దూకేందుకు హరీష్ రావు ప్రయత్నించగా సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు టివి రామారావు ఆయనను గట్టిగా పట్టుకొని కదలకుండా చేశారు.
రామారావు పట్టు నుండి హరీష్ రావు తప్పించుకోలేక పోయారు. ముఖ్యమంత్రి తీర్మానంను సభాపతి నాదెండ్ల మనోహర్ గురువారం మధ్యాహ్నం ప్రవేశ పెట్టి మూజువాణి ఓటు ద్వారా అభిప్రాయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు అటువైపు రాకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు సభాపతికి అడ్డుగా నిలిచారు. మరోవైపు 35 మంది మార్షల్స్ కూడా ఉన్నారు. ఈ సమయంలో హరీష్ రావును ఎమ్మెల్యే టివి రామారావు గట్టిగా పట్టుకున్నారు.
సభ అయిపోయాక పలువురు సీమాంధ్ర ఎమ్మెల్యేలు రామారావును పొగడ్తలతో ముంచెత్తారు. సభ నుండి బయటకు వస్తున్నప్పుటు హరీశ్ రావు, రామారావులు ఎదురు పడ్డారు. ఈ సమయంలో రామారావు మాట్లాడుతూ... ఏమీ అనుకోకు అన్నా చెప్పారు. దానికి హరీష్ రావు పక్కనున్న మరో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ అనుకోవద్దని అంటే ఎలా అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, గురువారం తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగిసిన విషయం తెలిసిందే. బిల్లు పైన ఓటింగ్ జరగకపోయినా ముఖ్యమంత్రి బిల్లును తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్మానం పైన మూజువాణి ఓటింగ్ జరిగింది. దీనిని రాష్ట్రపతికి పంపించనున్నారు. ఇక అందరు నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు.