రాజధాని తరలింపులో ప్రభుత్వం కొత్త ట్విస్ట్: కేంద్ర సైతం భాగస్వామే: ఆ నిర్ణయం వెనుక అసలు మెలిక ..!
ఏపీ రాజధాని తరలింపు విషయంలో కొత్త ట్విస్టు. కరోనా వ్యాపిస్తున్న సమయంలో రాజధాని తరలింపు వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై అమరావతి జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా రాజధాని తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఉద్యోగుల తరలింపుకు సిద్ధంగా ఉండాలంటూ సచివాలయ ఉధ్యోగులకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని పిటిషన్ ద్వారా కోర్టు ముందుంచారు. దీనిపైన విచారణ చేసిన కోర్టు ఏజీని వివరణ కోరింది. ఈ సమయంలో ఏజీ ఇచ్చిన సమాధానం అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు ఇందుకోసం 10 రోజుల సమయం ఇచ్చింది. అయితే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు రాజకీయంగానూ హాట్ టాపిక్గా మారింది. దీంతో ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోగా రాజధాని తరలింపు సాధ్యం కాదనే వాదన బలపడుతోంది.
ఏజీ ఆసక్తికర సమాధానంతో కొత్త టర్న్
ఒకవైపు కరోనా విజృంభిస్తున్న వేళ మరోవైపు ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో భూములును సేకరించి పేదలకు పంపిణీ చేసే అంశంలోనూ అదేవిధంగా విశాఖకు పరిపాలనా రాజధాని తరలించే విషయంపై కొన్ని అడుగులు వేసినట్లు తెలుస్తోంది. దీంతో అమరావతి జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మే నెలాఖరులోగా విశాఖకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. ఇదే విషయాన్ని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. దీంతో పాటుగా అధికార పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజధాని తరలింపు అడ్డుకోవడం ఎవర వల్ల సాధ్యం కాదంటూ చేసిన వ్యాఖ్యలను సైతం న్యాయమూర్తి ముందు పిటిషనర్ తరపున అడ్వకేట్ వివరించారు. దీంతో కోర్టు పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఏజీ వివరణ కోరింది. ఆసమయంలో రాజధాని తరలింపుపై శాసన ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన బిల్లుల వ్యవహారం తేలేవరకు రాజధాని మార్పు ఉండదని ఏజీ ప్రభుత్వం తరపున స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ సమాధానాన్ని కౌంటర్ రూపంలో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఇందుకోసం ఏజీకి 10 రోజుల సమయం కేటాయించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం రెస్పాండెంటుగా చేర్చారు. రాజధాని మార్పు వ్యవహారంలో ఎటువంటి అడుగులు వేసినా కోర్టుకు నివేదించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రభుత్వం వాదన ఇలా..
రాజధాని తరలింపునకు సంబంధించి రెండు బిల్లులు శాసన సభలో ఆమోదం పొందినా మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మెన్ నిర్ణయించారు. ఐతే ఛైర్మెన్ నిర్ణయం పైనా భగ్గుమన్న ప్రభుత్వం మండలిని రద్దు చేసింది. ఛైర్మెన్ ఆదేశించినా ఆ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదు . దీనిపైన ఎటువంటి నిర్ణయం జరగలేదు. దీంతో ప్రభుత్వం కొత్త వాదన తెరపైకి తెచ్చింది. సభలో ప్రవేశపెట్టని బిల్లులు మూడు నెలల్లోగా ఆమోదం పొందకుంటే ఆటోమేటిగ్గా ఆమోదం లభించనట్లే భావించాల్సి ఉంటుందని ప్రభుత్వ ముఖ్యుల వాదన. అయితే ఆ నిబంధన ఫైనాన్స్ బిల్లులకు మాత్రమే వర్తిస్తుందని ఈ రెండు బిల్లులు ప్రభుత్వం ద్రవ్యబిల్లులుగా ప్రవేశపెట్టకపోవడంతో ఇవి ఎప్పటికైనా సెలెక్ట్ కమిటీలకు పంపాల్సిందేనని ప్రతిపక్షం వాదన. ఏది ఏమైనా వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంలోగా తొలుత ముఖ్యమంత్రి కార్యాలయంతో ప్రారంభించి దశలవారీగా విశాఖకు పరిపాలనా వ్యవహారాలను తరలించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉంది.
Recommended Video
ఈ ఏడాదికి తరలింపు లేనట్టేనా...!
అయితే ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టుకు చేరడం, శాసన వ్యవస్థలో బిల్లులు ఆమోదం పొందకుండా ముందుకెళ్లమంటూ ఏజీ కోర్టుకు హామీ ఇవ్వడం ఒకవైపు, మరోవైపు కరోనా ఉధృతి కేంద్ర ప్రభుత్వాన్ని సైతం భాగస్వామ్యం చేయడం, కోర్టుకు వేసవి సెలవులు, పెండింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే కొత్త అకడెమిక్ సంవత్సరం ప్రారంభంలోగా విశాఖకు రాజధాని తరలింపు సాధ్యం కాదని మరో ఏడాది పాటు ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకున్నా అమరావతి నుంచి పాలన సాగించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నారు.