వివేకా హత్యకేసు: సీబీఐ అధికారులను చంపేస్తాం; ముసుగువ్యక్తి వార్నింగ్; పోలీసులకు ఫిర్యాదు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు బెదిరింపులను ఎదుర్కోవాల్సి వస్తుంది. హత్య కేసు దర్యాప్తులో ముందుకు సాగకుండా వస్తున్న బెదిరింపులు సిబిఐ అధికారులకు తలనొప్పిగా తయారయ్యాయి. తాజాగా శివ శంకర్ రెడ్డి తో మీకు ప్రమాదం, బయటకు రాగానే సిబిఐ బృందాన్ని చంపేస్తాడు అంటూ గుర్తు తెలియని వ్యక్తి సిబిఐ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సంఘటన చోటు చేసుకుంది.

మసుగు వ్యక్తి బెదిరింపు... శివశంకర్ రెడ్డి బయటకొస్తే బాంబు వేసి పేల్చేస్తారని వార్నింగ్
ముసుగు ధరించిన ఓ వ్యక్తి తనను బెదిరించాడని సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ షేక్ వలీ భాషా కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జైల్లో ఉన్నంత వరకే సిబిఐ బృంద సురక్షితంగా ఉంటుందని, బెయిల్ మీద ఆయన బయటకు వస్తే సిబిఐ బృందాన్ని చంపేస్తాడు అని బెదిరించినట్లు గా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సిబిఐ బృందం వెంటనే కడప నుంచి విజయవాడకు తిరిగి వెళ్లిపోవాలని, లేదంటే బాంబు వేసి పేల్చేస్తామని ఈ విషయాన్ని సీబీఐ అధికారులకు చెప్పాలని ఆ ముసుగు మనిషి హెచ్చరించినట్టు డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీబీఐ అధికారుల వారం రోజు కదలికలను చెప్పిన ముసుగు మనిషి
ఈనెల 8వ తేదీన సిబిఐ ఎస్ ఐ అంకిత్ యాదవ్ ఆదేశాల మేరకు జీత్ పంజాబీ దాబా నుండి భోజనం తీసుకురావడానికి కడప హరిత హోటల్ నుంచి తాను వెళుతున్న క్రమంలో దారి మధ్యలో పాత బైపాస్ రోడ్డు లోని పద్మావతి వీధి లో దస్తగిరి గ్రానైట్ షాప్ ఎదురుగా ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి తన వాహనాన్ని అడ్డుగా వచ్చి తనను బెదిరించాడని, అంతేకాకుండా వారం రోజులుగా తాను నడిచే వాహనం తో పాటుగా సిబిఐ ప్రోటోకాల్ కు చెందిన మరో వాహనానికి సంబంధించిన కదలికలను గురించి అతను చెప్పాడని డ్రైవర్ వెల్లడించాడు.

సీబీఐ అధికారుల కదలికలపై రెక్కీ ..
ముసుగు వ్యక్తి చెప్పిన పలు విషయాలను కూడా వెల్లడించిన సిబిఐ అధికారుల వాహన డ్రైవర్ ఈనెల 6వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో సిబిఐ క్యాంపు కార్యాలయం నుంచి స్పెషల్ పీపీ చెన్నకేశవులును కారులో ఎక్కించుకొని అమరావతి హైకోర్టుకు తీసుకెళ్ళావు. నీ వాహనాన్ని అక్కడ పార్కింగ్ లో నిలిపి ఉంచావు. ఆపై అక్కడనుండి బస్టాండ్ సమీపంలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లావు. ఈనెల 7వ తేదీన శైలజ ట్రావెల్స్ కార్యాలయానికి వెళ్లావు అంటూ తన ప్రతి కదలికను ముసుగు వ్యక్తి చెప్పాడని పేర్కొన్నారు. సీబీఐ అధికారుల కదలికలపై రెక్కీ వేసినట్టు అతని వ్యాఖ్యలతో అర్ధం అయిందని పేర్కొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన సీబీఐ అధికారుల వాహన డ్రైవర్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నత వ్యక్తుల ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వస్తున్నాం అని డ్రైవర్ వెల్లడించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏది ఏమైనా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించడం సీబీఐ అధికారుల బృందానికి పెను సవాల్ గా మారింది. అనేక బెదిరింపులు, హెచ్చరికల మధ్య వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications