ఆ రెండు జిల్లాలకు కొత్త ఎస్పీలు, ఐబీ చీఫ్పై కొనసాగుతోన్న కన్ఫ్యూజన్
హైదరాబాద్ : ఏపీలో ఐపీఎస్ బదిలీలపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రాజేసింది. వైసీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో మొదలైన బదిలీ ప్రక్రియ ఇష్యూ .. జీవోల జారీతో పీక్ స్టేజీకి చేరింది. అయితే ఈసీ జీవోను కాక మరో జీవో జారీచేసి తెలివిగా వ్యవహరించింది ఏపీ సర్కార్. కానీ ఐబీ చీఫ్ పోస్టింగ్పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

కొత్త ఎస్పీలు
అత్యంత వివాదాస్పద పరిస్థితుల్లో బదిలీ వేటుకు గురైన ఆ రెండు జిల్లా ఎస్పీల స్థానంలో కొత్త అధికారులు నియమితులయ్యారు. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ నవదీప్ సింగ్ గ్రెవాల్ శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా పనిచేస్తోన్న అభిషేక్ మొహంతిని కడప జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ వేటు ..
ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడం వల్లే.. కడప, శ్రీకాకుళం జిల్లాలకు ఇంత హడావుడీగా కొత్త అధికారులను ఎస్పీలుగా నియమించడానికి గల కారణాలు మనకు తెలిసినవే. కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నం పనితీరు వివాదాస్పదంగా ఉందని గుర్తించిన ఎన్నికల సంఘం వారిపై బదిలీ వేటు వేసింది. ప్రధానంగా- ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంనూ ఉన్నపళంగా బదిలీ చేయాలని ఆదేశించింది.

కోర్టుకు ఏపీ సర్కార్
ఎన్నికల సంఘం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ముగ్గురినీ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ పోస్టుపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారు. ఏబీ బదిలీని నిరసిస్తూ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications