గుంటూరు జిల్లాకు పాకిన టీడీపీ 'ఆకర్ష్': పోలేక ఉండలేక ఆ ఇద్దరూ సతమతం?
అమరావతి: తెలుగులో ఓ సామెత ఉంది. 'మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన' అని. ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలే చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కారు.
తాజాగా ఈ ఫిరాయింపుల సంస్కృతి గుంటూరు జిల్లాకు పాకింది. గడచిన ఎన్నికల్లో 17 స్థానాలున్న గుంటూరు జిల్లా నుంచి వైసీపీ పార్టీ తరుపున ఐదుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్'కు ఆకర్షితులై అందులో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు టీడీపీ అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సిగ్నల్ రావడంతో టీడీపీకి చెందిన కొందరు నేతలు వారితో మంతనాలు మొదలు పెట్టారు. అయితే ఈ మంతనాలు ఎక్కువ మంది ద్వారా చేయడంతో భారీ కోరికలను బయటపెట్టారు.
తొలుత తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఇస్తే సరిపోతుందని... ఇక ఎలాంటి హామీలు లేకుండా బేషరతుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత పార్టీకే చెందిన మరికొంతమంది టీడీపీ నేతలు ఆ వైసీపీ ఎమ్మెల్యేని కలిశారు.
దీంతో తనకు ఎనలేని డిమాండ్ ఉందని భావించిన ఆ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి ఎన్నికలకు అయిన ఖర్చులను జగన్మోహన్ రెడ్డి ఇస్తానని హామీ ఇచ్చారని.. ఆ తర్వాత పైసా కూడా ఇవ్వలేదని.. ఆ ఖర్చులు కనుక తనకు ఇస్తే టీడీపీలోకి చేరేందుకు సిద్ధమని చెప్పాడు.
అదే విధంగా మరో ఎమ్మెల్యే తనకు కార్పోరేషన్ ఛైర్పర్సన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశాడంట. అందుకు అంగీకరించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో మరికొంతమంది టీడీపీ నేతలు కూడా ఆ వైసీపీ ఎమ్మెల్యేతో మంతనాలు చేయడంతో చివరకు ఆయన కూడా బెట్టుగా కూర్చున్నారు.
ఎక్కువ మంది టీడీపీ నేతలు మాట్లాడటం... డీల్ చేసే విధానం సరిగ్గా కుదరలేదని టీడీపీ పెద్దలు గమనించారు. ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారన్న విషయం అధినేత వైయస్ జగన్కు తెలిసిపోయింది.
ఎప్పటిలాగే ఆ పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు నచ్చచెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో డీల్ కుదరకపోవడం ఒకందుకు మంచే జరిగిందని, వైసీపీలో కూడా మంచి డిమాండ్ వచ్చిందని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సంతోషపడ్డారు.
అయితే పార్టీ అధినేత వైయస్ జగన్ మాత్రం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను దూరంగానే పెడుతున్నట్లు సమాచారం. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారట. అటు టీడీపీలోకి వెళదామంటే ఆ పార్టీ నేతలు బిగుసుకుపోయారు. సొంత పార్టీలో ఉందామంటే అధినేత వద్ద ఆదరణ లేకుండా పోయిందని తెగ బాధపడుతున్నారంట.