తిరునాళ్లలో విద్యుత్ ప్రభ విరిగిపడి ఇద్దరు మృతి
గుంటూరు: తిరునాళ్లలో అకస్మాత్తుగా విద్యుత్ ప్రభ విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయిన సంఘటన గుంటూరు జిల్లా నూజెండ్లలో బుధవారం జరిగింది. జిల్లాలోనే మొట్టమొదటిగా ప్రారంభమైన రామయోగిస్వామి తిరునాళ్లకు భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తోంది.
45 అడుగుల ఎత్తులో విద్యుత్ ప్రభను ఏర్పాటు చేసేందుకు ఆరుగురు కార్మికులు పనిచేస్తుండగా, అది విరిగి పడి లైటింగ్ పనులు చేస్తున్న ముగ్గురు యువకులు కిందపడగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మృతిచెందిన వారిలో గుంటూరు జిల్లా పోతవరం గ్రామానికి చెందిన సయ్యద్ బాజి (26) మురికిపూడి గ్రామానికి చెందిన కె వంశీ (18) అక్కడికక్కడే మృతి చెందారు. మురికిపూడి గ్రామానికి చెందిన ప్రభ కాంట్రాక్టర్ ఆదిబాబు కుమారుడు దిలీప్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.
మరో ముగ్గురు ప్రభకు మధ్యభాగంలో ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. తీవ్రంగా గాయపడిన దిలీప్ పరిస్థితి విషమించడంతో గుంటూరుకు తరలించారు.