పవన్కల్యాణ్ను కలిసిన ఇద్దరు YCP ఎమ్మెల్యేలు.. ఎన్నికల సమయానికి జనసేన గూటికి?
ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్కల్యాణ్ను వ్యక్తిగతంగా హైదరాబాద్ లో కలిసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనేదానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పవన్ను కలవడం నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తాము వీరాభిమానులమని చెప్పుకునేవారు. అలాంటివారు కూడా తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధపడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది అంచనా వేయవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత?
రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీపై ప్రజల్లో అంతర్గతంగా వ్యతిరేకత ఉందనేది వీరిద్దరి అభిప్రాయమని, దాన్ని అధిగమించి తాము గెలుపొందాలంటే పార్టీ మారడం ఒక్కటే సరైందనే అంచనాకు రావడంతో వీరు పవన్ కలిసినట్లు తెలుస్తోంది. పవన్కల్యాణ్తో టచ్ లో ఉన్నారంటే ఈ ఇద్దరు నేతల మనస్తతాన్ని అంచనా వేయాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి.
నియోజకవర్గాల్లో వీరి మీద ఉన్న వ్యతిరేకతను అధిగమించడానికే జనసేన వైపు చూస్తున్నారనేది వారి ఆరోపణ. పవన్కల్యాణ్ను కలిసిన తర్వాత వీరి వ్యవహారాల్లో కూడా మార్పులు వచ్చాయని చెబుతున్నారు. వారి వారి సామాజికవర్గాలవారికే పనులు చేస్తున్నారని, ఇతరులు ఎవరైనా వెళితే ముఖ్యమంత్రి జగన్ ను చూసి ప్రజలు ఓటువేశారని, మమ్మల్ని చూసి ఓటేయలేదని, కాబట్టి జగన్ దగ్గరకే వెళ్లి పనిచేయించుకోవాలని చెప్పి పంపిస్తున్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల వరకు ఉండి పునాదిని పటిష్టం చేసుకోవాలి
వైసీపీలోనే ఉంటూ ఎన్నికల వరకు తమ పునాదిని పటిష్టం చేసుకొని, తమ తమ సామాజికవర్గాలవారికి న్యాయం చేసుకొని ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లినా తమకు గెలుపు తథ్యమని అనుకున్నతర్వాతే పార్టీ మారతారని తెలుస్తోంది. వీరు గత ఎన్నికలకు ముందు చివరి నిముషంలో పార్టీలో చేరారని, పార్టీ పంపించిన నిధులు కూడా ఖర్చుపెట్టలేదని తెలుస్తోంది. ఇటువంటి నేతలను పార్టీలో చేర్చుకోవద్దని వైసీపీ శ్రేణులు జనసేనానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చనే అంచనాతో..
అధికారం ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తవగానే ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ రావచ్చని వైసీపీ వర్గాలే భావిస్తున్నాయి.
దీంతో ఎమ్మెల్యేలు ముందు జాగ్రత్తగా ప్రణాళికలు రచించుకుంటున్నారని, పార్టీమీద వ్యతిరేకత ఉంటే తాము గెలవడం కష్టమని, అందుకే పవన్కల్యాణ్ను కలిసినట్లుగా ఆ ఎమ్మెల్యేల అనుచరులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల సమయానికి వైసీపీ తరఫున వీరికి సీట్ల కేటాయింపు ఉంటుందా? లేదంటే జనసేన తరఫున పోటీచేస్తారా? అనేదానిపై కొంత స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచిచూడక తప్పదు.!!












Click it and Unblock the Notifications