కేసులు లేని ఉదయబాను.!జగ్గయ్యపేట ఎమ్మెల్యే పై ఉన్న పది కేసులను ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం.!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ఎవరికి జరిమానా విధిస్తారో, ఎవరికి నజరానా ప్రకటిస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరంపరలో జగ్గయ్యపేట వైసిపీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను పట్ల ఊహించని నిర్ణయం తీసుకుంది ఏపి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసేకున్న కీలక నిర్ణయం పట్ల సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను. ప్రభుత్వ విప్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో ఎత్తి వేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కొనసాగుతున్న సందర్బంలో వైసిపీ ఎమ్మెల్యేపై ఉన్న కేసులను ఎత్తేయడం ఏపీ లో చర్చనీయాంశంగా మారింది. కాగా విజయవాడలో ఏర్పాటైన రాష్ట్రస్థాయి ప్రత్యేక న్యాయస్థానంలో సామినేని ఉదయభానుపై నమోదైన ఈ పది కేసుల విచారణ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో వాటన్నింటినీ ఒకేసారి ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఈ ఏడాది మార్చి 23న డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోం మంత్రిత్వశాఖ కేసుల ఎత్తివేత ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు వీలుగా ఆయా న్యాయస్థానాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులిచ్చింది. కాగా.. సీఎస్పీఏ ఆర్గనైజేషన్ పేరిట సర్వే నిర్వహిస్తున్న కొందరు సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని, వారిని అక్రమంగా అపహరించి నేరపూరితంగా బెదిరించారన్న ఫిర్యాదుపై జగ్గయ్యపేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్లో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆర్అండ్బీ ఏఈఈ విధులకు ఆటంకం కలిగించటం, నేరపూరిత బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులను ప్రత్యేక న్యాయస్థానం ఎత్తివేసింది. వాటితోపాటు జగ్గయ్యపేట స్టేషన్లో నమోదైన మరికొన్ని కేసులు, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లల్లో నమోదైన పలు కేసులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సామినేని ఉదయబాను కేసులు లేని ఉదయబానుగా మారిపోయారు.