రాజకీయాల్లో ఉండను: కెసిఆర్ వ్యాఖ్యలపై ఉమా
చిత్తూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అసత్య ఆరోపణలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల రైతుల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే.. కెసిఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మూడు ప్రాంతాల రైతుల సంక్షేమం కోసమే గతంలో చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు వ్యతిరేకంగా మహాధర్నా చేశారని గుర్తు చేశారు. ఇది అసత్యమని నిరూపిస్తే.. తాను ముక్కు నేలకు రాసుకుంటానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉమా మహేశ్వరరావు సవాల్ చేశారు.
చంద్రబాబు ధర్నాను కెసిఆర్ వక్రీకరించి చెబుతున్నారని అన్నారు. ముందు చూపు లేకపోవడంతోనే కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభంలోకి నెట్టారన్నారు. సెంటిమెంటుతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదని, వారి సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. ఇన్నాళ్లు నిద్రపోయిన కెసిఆర్.. చంద్రబాబును నిందించడం సరికాదని అన్నారు.
చంద్రబాబునాయుడు ముందుచూపుతో కరెంటును కొన్నారని అన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గితే రాయలసీమకు తాగడానికి నీరుండదని ఉమా మహేశ్వరరావు అన్నారు. పైరాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి ఒక్కనీటిచుక్కను కూడా తెచ్చుకోలేమని చెప్పారు.
కెసిఆర్తో చర్చలకు సిద్ధం: చినరాజప్ప
కడప: శ్రీశైలం జలాశయంలో నీటి వినియోగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో చర్చించేందుకు ఏపి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ నిర్వాకంతోనే తెలంగాణలో విద్యుత్ కష్టాలు వచ్చాయని అన్నారు. ఏపి సిఎం చంద్రబాబు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి పెట్టడంతో సమస్యను అధిగమించామని తెలిపారు. కెసిఆర్ శ్రీశైలం నీటిపై రాజకీయం చేస్తున్నారని, ఇది సరి కాదని అన్నారు.