'అక్రమమంటూ నోటిసులిచ్చారు, ఆ భవనంలోనే సీఎం ఎలా ఉంటారు?'
విజయవాడ: కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు చారీ చేసిన భవనంలో సీఎం చంద్రబాబు ఎలా నివాసం ఉంటారని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా అక్కడి సంస్ధలతో ఒప్పందం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు
ఢిల్లీ లాంటి మహా నగరాన్ని నిర్మించింది భారతీయులే అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలని ఉమ్మారెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణానది కరకట్టకు సమీపంలో ఉన్న లింగమనేని ఎస్టేట్స్కు చెందిన భవనాన్ని అక్రమంగా నిర్మించారంటూ, ఈ భవనాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని ప్రభుత్వం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఇదే భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ప్రభుత్వం లీజుకు తీసుకుంది. ఈ భవనంలోని మరమ్మతులు, సౌకర్యాలకు రూ. కోట్లు కుమ్మరిస్తోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇందులోకి గృహప్రవేశం చేశారు. చంద్రబాబు ప్రస్తుతం ఈ భవనంలోనే బస చేశారు.
కృష్ణా నదికి ఆనుకొని ఉన్న 272/2, 271 సర్వే నెంబర్లలో లింగమనేని ఎస్టేట్స్ అధినేత రమేష్కు 1.31 ఎకరాల భూమి ఉంది. 2007 మే 10న ఈ భూమిలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి నీటిపారుదల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్నారు. కానీ, స్విమ్మింగ్ పూల్ పేరుతో జీ+1 భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత రెండో అంతస్తు కూడా వేశారు.
కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొంతకాలం కిందట ప్రకటించారు. ఆ తర్వాత జలవనరుల శాఖ సర్వే చేసి ప్రకాశం బ్యారేజీకి ఎగువన 22 అక్రమ కట్టడాలున్నట్లు నిర్ధారించింది.
నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాలను ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ మార్చి 5న తేదీన తాడేపల్లి తహసీల్దార్ నోటీసులిచ్చారు. ఇంతలో ఏమైంతో తెలియదు కానీ ఇవన్నీ అక్రమ భవనాలంటూ విచారణకు అదేశించిన మంత్రి దేవినేని ఈ విషయం గురించే మాట్లాడడమే మానేశారు.