టీడీపీ చేతికి మరో అస్త్రం: ఏపీలో విద్యుత్ కోతలు తీవ్రం: ఏం జరుగుతోంది..!
ఏపీలో వైసీపీ నాలుగ నెలల ప్రభుత్వం మీద నిత్యం ఆరోపణలు..విమర్శలతో టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష టీడీపీకి మరో అస్త్రం దొరికింది. ఏపీలో అయిదు జిల్లాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. దీని మీద ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వం మూడు నెలలుగా అదనపు విద్యుత్ కొనుగోలు చేస్తుందనే సమాచారం ఉంది. అయితే.. తూర్పు విద్యుత్ సంస్థ పరిధిలోని అయిదు జిల్లాల్లో విద్యుత్ కోతలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. తమ హాయంలో మిగులు విద్యుత్ తో రాష్ట్రంలో ఎక్కడా కోతలు లేకుండా పాలన చేస్తే..నాలుగు నెలల పాలనలో విద్యుత్ కోతలు తీసుకొచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో అనధికారిక కోతలు విధిస్తున్నారు. దీని కారణంగా ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. తెలంగాణలోనూ విద్యుత్ కోతలు లేవు. ఒక వైపు గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల వివాదం నడుస్తుండగానే..తాజాగా ఈ కోతలు మరింత సమస్యగా మారుతున్నాయి.
అనధికారికంగా భారీ కోతలు..
ఏపీలోని అయిదు జిల్లాల్లో అనధికారికంగా గంటల తరబడి అనధికారిక విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరితో పాటుగా ఉత్తరాంధ్రలో కోతలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతీ రోజు గంటల తరబడి విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పండుగ రోజుల్లో అమలు చేస్తున్న ఈ కోతల మీద సామాన్యుల నుండి అసహనం వ్యక్తం అవుతోంది. పవన్ విద్యుత్ ఉత్పత్తి పడి పోవటంతో విపరీతంగా డిమాండ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. సెంటర్ గ్రిడ్ నుండి నిర్ణీత కేటాయింపు కన్నా ఎక్కువగా విద్యుత్ ను వాడటం వలనే సమస్యలు వస్తున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. తూర్పు ప్రాంత పరిధిలో శనివారానికి 750 మెగావాట్ల విద్యుత్తు కొరత అధికారికంగా నమోదైంది.
రాత్రికి ఇది 500 మెగావాట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఎక్కడా వినియోగం మాత్రం తగ్గటం లేదు. శుక్ర..శని వారాల్లో పవర్ గ్రిడ్ నుండి కేవలం 14 మిలియన్ యూనిట్లే తీసుకోవాలని నిబంధన విధించారు. దీని పైన అధికారులు మాత్రం సమస్య పరిష్కారం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రిష్ణపట్నం ధర్మల్ ప్రాజెక్టులో అక్టోబర్ 1 నుండి విద్యుత్ ఉత్పత్తి ఉంటుందని...దీంతో ఇబ్బందులు తీరుతాయని చెబుతున్నారు.

రాజకీయంగా టీడీపీకి అస్త్రంగా..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పైన సమీక్ష కు నిర్ణయించింది. దీని పైన పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం అవగాహన లేకుండా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. పీపీఏల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. మూడు నెలలుగా కొత్త ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేస్తుందని చెబుతూ వస్తోంది. దీని పైన ప్రభుత్వం మాత్రం అధికారికంగా స్పందించటం లేదు. ఇప్పుడు ఇదే సమయంలో ఏపీలో అమలవుతున్న అనధికార విద్యుత్ కోతలు రాజకీయ రంగు పులుముకొనే అవకాశం ఉంది.
అయితే..ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న అనైతిక నిర్ణయాలను సరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. ఇదే రకంగా కోతలు మరింత కాలం కొనసాగితే రాజకీయంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందనే భయం వైసీపీ నేతలు వెంటాడుతోంది. మరి..అధికారులు చెబుతున్నట్లుగా అక్టోబర్ 1 నుండి కోతలు లేకుండా చేయగలరా లేదా అనేది చూడాలి. దీని పైన ప్రభుత్వం అధికారికంగా స్పందించక పోవటం పైన విమర్శలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications