మళ్లీ అనధికార విద్యుత్ కోతలు - భారీగా పెరిగిన వినియోగం..!!
విద్యుత్ సరఫరా మెరుగుపడి..కోతలు ఇక లేనట్లేనని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా వినియోగం పెరిగిపోయింది. ఫలితంగా అనధికార విద్యుత్ కోతలు మొదలయ్యాయి. అనేక ప్రాంతాల్లో అనధికారిక కోతలు అమలయినట్లు తెలుస్తోంది. బుధవారం 198.21 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉంటే.. దీనికి అనుగుణంగా సరఫరా చేయలేక అత్యవసర లోడ్ సర్దుబాటు పేరిట 5.68 మిలియన్ యూనిట్ల మేర కోత విధించాల్సి వచ్చింది. పలు మున్సిపాల్టీలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ అనధికారికంగా కోతలు విధించక తప్పలేదు. డిమాండ్ పెరిగిన వేళ..అంచనాలకు తగిన విధంగా ఉత్పత్తి జరగటం లేదు.
విండ్ పవర్ విద్యుత్ సరిపోవటం లేదు. థర్మల్ యూనిట్లలో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి తగ్గడంతో అత్యవసర లోడ్ సర్దుబాటుకు కోతలు విధించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 190 నుంచి 200 మిలియన్ యూనిట్ల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు వేస్తున్నారు. బుధవారం డిమాండ్ 198.21 మిలియన్ యూనిట్లు ఉన్నా.. దీనికి అనుగుణంగా సరఫరా చేయడం డిస్కంలకు సాధ్యపడలేదు. థర్మల్ విద్యుత్ 84.36 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ 6.49, పవన విద్యుత్ 22.93, సౌర విద్యుత్ 14.08, ఇతర వనరుల నుంచి.. 5.73, కేంద్ర ఉత్పత్తి సంస్థ నుంచి 48.62 మిలియన్ యూనిట్లు గ్రిడ్కు అందాయి. ఎక్స్చేంజీల నుంచి 6.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ను డిస్కంలు కొన్నాయి.
Recommended Video
జాతీయ గ్రిడ్ నుంచి అన్ షెడ్యూల్డ్ ఇంటర్ ఛేంజ్ కింద 3.59 మిలియన్ యూనిట్లు అదనంగా తీసుకున్నా ఇంకా 5.68 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉత్పత్తి నిలిచిపోయింది. మరో యూనిట్ నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి రావడం లేదు. మంగళవారం సగటున 321, బుధవారం 316 మెగావాట్లే వచ్చింది. కర్ణాటకలోని కూడ్గి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కొనుగోలు ఒప్పందాల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 240 మెగావాట్లలో కేవలం 80 మెగావాట్లే వస్తోంది. దీంతో..గతంలో పవర్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం..సరఫరా మెరుగుపడటంతో ఆ నిర్ణయాన్ని ఉప సంహరించుకుంది. అదే విధంగా ఎక్కడా కోతలు లేవని ప్రకటించింది. కానీ, అనూహ్యంగా పెరిగిన డిమాండ్..తగ్గిన సరఫరాతో మరోసారి రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు మొదలయ్యాయి.