బాబా ముసుగులో ఏడేళ్లుగా బాబాయ్ ఘాతుకం: అమ్మాయిపై రేప్, వీడియోలతో బ్లాక్మెయిల్
గుంటూరు: వరుసకు కూతురైన అమ్మాయిపై ఓ వ్యక్తి అత్యంత నీచంగా వ్యవహరించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్లుగా బాలికను చిత్రహింసలు పెట్టాడు. బాధితురాలు సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది.
ఏటుకూరుకు చెందిన ముగ్గురు సోదరుల్లో ఒకడైన బాధితురాలి తండ్రి 2007లో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఇంటర్ చదువుతున్న యువతి బాధ్యతను తాముచూసుకుంటామని బాబాయి, నాయనమ్మ హామీ ఇచ్చారు. ఆమె బాబాయి బాబానంటూ పూజలు, హోమాలు చేస్తూ పెళ్లికి దూరంగా ఉన్నాడు.
ఈ క్రమంలో యువతిని గుంటూరులోని తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత వారం రోజులకే హైదరాబాద్లోని ఆర్య సమాజానికి తీసుకువెళ్లాడు. అక్కడే ఆ యువతిని లొంగ తీసుకొని బలాత్కారం చేశాడు. రెండు నెలల తరువాత ఏటి అగ్రహారం తీసుకువచ్చాడు. జరిగిన విషయాన్ని యువతి నాయనమ్మకు చెప్పడంతో ఆమె నిలదీసింది. దీంతో తల్లిపై కూడా దాడి చేశాడు. తల్లి భయపడి కుమారుడికే వత్తాసు పలికింది.
దాంతో ఆగకుండా బాబాయి ఆ యువతి ఆస్తిపై కన్నేశాడు. ఆమెకు పెళ్లి చేయాలంటూ యువతి తల్లి నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ తరువాత ఆ యువతిని బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె తల్లి వద్ద నుంచి మరికొంత డబ్బు తెచ్చి ఇచ్చింది. ఈ విధంగా వారి నుంచి రూ.13 లక్షలు రాబట్టుకున్నాడు.
ఏటుకూరులో ఉన్న ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వాలంటూ యువతిని బెదిరించాడు. అంతేకాక జీవితాంతం తనకు శిష్యురాలిగా ఉండాలంటూ వేధింపులు ప్రారంభించాడు. దీంతో బాధితురాలు బాబాయిని వదిలి తల్లి వద్దకు వచ్చింది. నగరంలోని ఓ సంస్థలో చేరి యానిమేషన్ నేర్చుకుంటున్నా ఆమెను బాబాయి వదలలేదు.
ఆమె తమ్ముడికి విషయం చెప్పి డబ్బు ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోను ఫేస్బుక్, నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో అక్కాతమ్ముడు బాబాయికి చెక్కులు, ప్రామిసరి నోట్లు, స్టాంప్ పేపర్లపై సంతకాలు పెట్టి ఇచ్చారు. బాధితురాలి తమ్ముడి నుంచి తీసుకున్న చెక్కు బౌన్స్ కావడంతో ఏకంగా వారికి నోటీసులు పంపాడు. దీంతో బాధితులు అర్బన్ ఎస్పీని ఆశ్రయించారు. అయితే తమ నుంచి రూ.13 లక్షల వరకు డబ్బు తీసుకొని మోసం చేశాడంటూ బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.