ఉండవల్లి అరెస్ట్-గోరంట్లను అడ్డుకున్న పోలీసులు: ఉద్రిక్తత
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుని బహిరంగ చర్చ పేరిట వీరిద్దరు ప్రకాశం బ్యారేజీపై చర్చ జరిపేందుకు వచ్చారు.

ఉండవల్లి అరెస్ట్
కాగా, ఇక్కడ అనుమతి లేదంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ను బ్యారేజీ వరకు చేరుకోకముందే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా, బుచ్చయ్యచౌదరిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ అనుచరులు, రైతులతో కలిసి వచ్చిన బుచ్చయ్య చౌదరిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విజయవాడ హనుమాన్ జంక్షన్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Recommended Video


గోరంట్ల సవాల్ స్వీకరించా..
ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీపై అన్ని విషయాలను వివరిస్తానని అన్నారు. పట్టిసీమ, పోలవరం మీద గత రెండేళ్లుగా తన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. బుచ్చయ్య చౌదరి ప్రకాశం బ్యారేజీపై తేల్చుకుందామని అన్నారని, ఆయన సవాల్ స్వీకరించే ఇక్కడకు వచ్చానని ఉండవల్లి తెలిపారు.

సమాచారం లేకుండా అరెస్ట్ చేశారు..
మంగళవారం ఉదయం 11గంటలకు అని బుచ్చయ్య చెప్పారని, తాను అరగంట ముందే వచ్చానని ఉండవల్లి చెప్పారు. అయితే, అనుమతి లేదంటూ పోలీసులు తనను అరెస్ట్ చేశారని చెప్పారు. తనన బందరు వైపు పోలీసులు తమ వాహనంలో తీసుకెళుతున్నారని ఉండవల్లి తెలిపారు. అనుమతి లేని విషయం తనకు బుచ్చయ్య చౌదరి గానీ, పోలీసులు గానీ ముందే చెప్పలేదని ఆయన అన్నారు. సెక్షన్ 151కింద తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

క్షమాపణలు చెబుతా..
తానేమీ బల ప్రదర్శన చేయడానికి రాలేదని, తాను ఒక్కడినే వచ్చానని ఉండవల్లి తెలిపారు. పోలవరానికి పట్టిసీమ ప్రత్యామ్నాయం కాదని, పట్టిసీమ.. పోలవరానికి భాగం కాదని అన్నారు. ప్రాజెక్టుల అక్రమాలపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే క్షమాపణలు చెబుతానని ఉండవల్లి అన్నారు.

నేను సిద్ధం, అందుకే అనుమతివ్వలేదు
ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ.. తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పట్టిసీమ ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో సవివరింగా చెబుతామని ఆయన చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతల తరపున ఉండవల్లి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం, మందకృష్ణ ఘటనల నేపథ్యంలో తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పారని గోరంట్ల తెలిపారు. కాగా భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు, రైతులు తరలి రావడం, వర్షం కురుస్తుండటంతో విజయవాడ జంక్షన్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పట్టిసీమ ద్వారా పంట పొలాలకు నీళ్లు వస్తుంటే ఉండవల్లికి ఇబ్బంది ఎందుకని పలువురు రైతులు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications