మోడీ అరెస్ట్ వ్యాఖ్య-జగన్ భేటీ: షాకింగ్.. బాబుకు భయమెందుకో చెప్పిన ఉండవల్లి
గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత నవ్యాంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆనాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని అరెస్టు చేయిస్తామని చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ అన్నారు.
రాజమహేంద్రవరం: గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత నవ్యాంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆనాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని అరెస్టు చేయిస్తామని చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీని వైసిపి అధినేత జగన్ కలిస్తే తప్పేమిటన్నారు. దీనిపై టిడిపి నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
టిడిపి రాద్దాంతం వెనుక భయం
ఇలా రాద్దాంతం చేయడం చూస్తుంటే తెలుగుదేశం వారికి ఏదో భయం పట్టుకున్నట్లు అనిపిస్తోందని ఉండవల్లి అన్నారు. గతంలో గోద్రా అల్లర్లు జరిగిన అనంతరం మోడీ దేశ పర్యటన చేస్తున్నప్పుడు, ఆయన హైదరాబాద్కు వస్తే అరెస్ట్ చేస్తామని 2003 ఆగస్టు 27న చంద్రబాబు ప్రకటించారని ఉండవల్లి చెప్పారు.
ఆ విషయం మోడీ మనసులో పెట్టుకున్నారేమో
అదే విషయాన్ని ప్రధాని మోడీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకున్నారేమోనని చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు తనకు అనిపిస్తోందని ఉండవల్లి అన్నారు. అవినీతి, ఓటుకు నోట్లు వంటి కేసుల నేపథ్యంలో మోడీ తనపై చర్యలు తీసుకుంటారేమోనని చంద్రబాబుకి భయమేస్తోందని ఆరోపించారు.
మోడీ - జగన్ కలుస్తారని...
రానున్న కాలంలో మోడీ, జగన్ కలిసి ముందుకు వెళతారేమోనని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారని, అందుకే జగన్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. వ్యవస్థ బాగుపడాలంటే మోడీ రావాలని జగన్ చెప్పారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
వైయస్ పైన ఫిర్యాదు చేశారుగా..
2004లో పరిటాల రవి హత్య అనంతరం నాటి కాంగ్రెస్ ప్రధానిని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు కలిసి వైయస్ రాజశేఖర రెడ్డి ఈ హత్య చేయించారని ఫిర్యాదు చేయగా లేనిది, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, విభజన హామీలపై జగన్ ప్రధానిని కలిసి విన్నవిస్తే తప్పేమిటని ఉండవల్లి అన్నారు.
మోడీ కావాలని జగన్ ఎన్నికలకు ముందే చెప్పారు
మోడీకి మన మద్దతు అవసరం లేదు కానీ, ఆయన మద్దతు ఏపీకి అవసరమని జగన్ చెప్పారని ఉండవల్లి గుర్తు చేశారు. వ్యవస్థ మార్చాలంటే మోడీ లాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావాలని ఎన్నికలకు ముందే జగన్ చెప్పారన్నారు.
హోదాపై విన్నవిస్తే..
ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని అమలు చేయాలని, రాజధాని లేని ఏపీ పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా సాయం చేయాలని జగన్ విన్నవిస్తే.. చంద్రబాబు, టిడిపి నేతలకు ఉలుకెందుకో చెప్పాలని ఉండవల్లి అన్నారు. విభజన హామీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రవికిరణ్ అరెస్టుపై..
సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టారని ఇంటూరు రవికిరణ్ను అరెస్టు చేయడంపై కూడా ఉండవల్లి స్పందించారు. ఆయనపై ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడాన్ని ఖండించారు. తాను కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నానని, తనను అరెస్ట్ చేయాలన్నారు. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో జపాన్ ఆర్కిటెక్ట్ కంపెనీ మకీ అసోసియేట్స్ రాసిన లేఖతో తేలిందన్నారు.