జగన్ ప్రభుత్వం రూ 6 లక్షల కోట్ల అప్పు చేసింది : సలహాదారులు ఏం చేస్తున్నారు-ఉండవల్లి..!!
ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తుందని ఆరోపించారు. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు దాదాపుగా ఆరు లక్షల కోట్ల మేర అప్పు చేసిందని ఉండవల్లి విశ్లేషించారు. ప్రభుత్వం అనేక మంది సలహాదారులను నియమించుకొందని..వారంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంత మంది సలహాదారులు ఉన్నా ఏపీ ఆర్దిక పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ఆయన అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుకు దేశంలోని ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా ఏపీ మాత్రం దీనికి ఒప్పుకుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. పోలవరంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్ట్ పనులు పూర్తికాకపోయినా హడావుడిగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం పనుల్లో ఎలాంటి మార్పులు రాలేదని వివరించారు.
ప్రాజెక్ట్కు సంబంధించి రూ.4,068 కోట్లు కొర్రీలు వేశారంటూ అసహనం వ్యక్తం చేసారు, ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడంలేదని చెప్పారు. తాగునీటి విషయంలో పోలవరం ప్రాజెక్ట్కు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. పోలవరం నిధులపై రాష్ట్రం ఏర్పాటు నుంచి చర్చ జరుగుతోందని... పోలవరం నిధులపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి ఉండవల్లి ప్రధానంగా పోలవరం తో పాటుగా కేంద్రం నుంచి దక్కించుకోవాల్సిన అంశాల పైన ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక, ఇప్పుడు రాష్ట్ర అర్దిక పరిస్థితి ..రుణాల కోసం ప్రభుత్వ ఆస్తుల తాకట్టు వంటి వ్యవహారాలతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్ ఇదే అంశం పైన ఏపీ ప్రభుత్వం పైన ఆరోపణలు గుప్పించారు.
ఏపీలో అస్తవ్యస్త ఆర్దిక వ్యవస్థ కారణంగానే ఉద్యోగులకు సకాలంలో జీతాలు...పెన్షనర్లకు సైతం పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇక, ఇప్పుడు రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించి ఉండవల్లి లాంటి వారు చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందనేది వేచి చూడాలి.