పట్టిసీమ వల్ల అరిష్టాలు, అమరావతి చంద్రబాబు కట్టుకున్న కోట: ఉండవల్లి
రాజమండ్రి: పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణమే తప్పు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. పూర్తి ఆధారాలతో ప్రజలముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. సమాచార హక్కుచట్టం కింద రికార్డులను పరిశీలించామని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా అమరావతి రాజధాని నిర్మాణం జరిగిందని విమర్శించారు. దీని వల్ల అరిష్టాలు సంభవించే అవకాశం ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పట్టి సీమ ప్రాజెక్టు జీవో, అగ్రిమెంట్ కాపీలను ఆయన గురువారంనాడు పరిశీలించారు.

నీటి పారుదల శాఖ కార్యాలయంలో వాటిని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రిజర్వాయర్ లేకుండానే 80 టిఎంసిల నీటిని తరలించేందుకు ప్రభత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.490 కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
తన లేఖకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదని ఉండవల్లి విమర్శించారు. రూ.830 కోట్లు ఖర్చు పెట్టి 53 శాతం పని చేసినట్లు చూపించారని ఆయన అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుకున్న కోట అని, అందులో ప్రజలకు భాగస్వామ్యం లేదని ఉండవల్లి అన్నారు.












Click it and Unblock the Notifications