హెరిటేజ్ పాలు తాగి ఎవరైనా మరణిస్తే చంద్రబాబును అరెస్టు చేస్తారా: ఉండవల్లి
విజయవాడ: కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణును కావాలనే మద్యం కేసులో ఇరికించారని రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చినా ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
హెరిటేజ్ పాలు తాగి ఎవరైనా చనిపోతే చంద్రబాబును అరెస్ట్ చేస్తారా? అని ఉండవల్లి ప్రశ్నించారు. స్వర్ణ బార్లో కల్తీ మద్యం తాగి మరణాలు సంభవిస్తే మల్లాది విష్ణును ఎలా అరెస్టు చేస్తారని ఆయన అడిగారు.
పోలీసులకు స్వేచ్ఛనిస్తే అసలైన నిందితులను బయటపెడతారని ఆయన చెప్పారు. ఈ కేసును రాజకీయ కోణంలోనే ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. మల్లాది విష్ణును అప్రతిష్టపాలు చేసేందుకే మద్యం దుకాణంలోని వాటర్కూలర్లో విషం కలిపారని ఆయన తెలిపారు.
టెర్రరిస్ట్ నేపథ్యం ఉన్నవారే ఇలాంటి దురాగతాలకు పాల్పడతారని, జైల్లో పెట్టినంత మాత్రాన మల్లాది విష్ణు ప్రతిష్ట ఏ మాత్రం దెబ్బ తినదని ఉండవల్లి చెప్పారు. గతంలోనూ వంగవీటి రంగానూ జైల్లో పెట్టారని, విడుదలైన తర్వాత వంగవీటి ఏ స్థాయికి ఎదిగారో అందరికీ తెలుసని ఆయన చెప్పారు.