రాష్ట్ర విభజన: రాజకీయాలకు ఉండవల్లి గుడ్బై,?
విభజనకు నిర్ణయం జరిగిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ఢిల్లీలోనే మకాం వేశారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపిలపై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. క్రమశిక్షణా చర్యలను ఆయన ఎదుర్కోవలసి వస్తుందని తెలిసి కూడా ఆయన ధిక్కారానికి సిద్ధపడ్డారు.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన అధిష్టానంపై ధిక్కారం ప్రకటించినట్లు చెబుతున్నారు. ఏ రాజకీయ పార్టీలోను చేరకుండా, ఎన్నికల్లో పోటీచేయకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలన్న మనసులోని మాటను ఇప్పటికే తన సన్నిహితుల వద్ద ఉండవల్లి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాంతో ఏకంగా రాజకీయాలకే దూరంగా ఉండాలన్న నిర్ణయానికి ఉండవల్లి వచ్చారు. దాంతోనే యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసును ఇచ్చారు.
వ్యూహాత్మకంగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన సమయంలో అదును చూసుకుని ఆయన మిగిలిన ఎంపిలతో కలిసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు.