జగన్ రూ.10వేల కోట్ల నల్లధనం ప్రకటించారా?: సీన్లోకి ఉండవల్లి
విజయవాడ: నల్లధనం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నల్లధనం వెల్లడించిన వారిలో హైదరాబాదుకు చెందిన తెలుగు వ్యక్తి ఒకరు రూ.10వేల కోట్లు వెల్లడించారని, అతను జగనేనని టిడిపి అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
దీనిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతోంది. తనను నల్లధనంలోకి లాగడాన్ని వైసిపి అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నల్లధనం వివరాలు చంద్రబాబు ఎలా చెప్పారో కావాలని లేఖ రాశారు. తాజాగా గురువారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నల్లధనం అంశంపై స్పందించారు.

నల్లధనం వెల్లడించినవారి పేర్లు బయటపెట్టాలని ఈ సందర్భంగా ఉండవల్లి డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీకి ఆయన లేఖ రాశారు. నల్లధనం వెల్లడి పథకాన్ని విజయవంతం చేసిన కేంద్రానికి ఉండవల్లి ధన్యవాదాలు తెలిపారు.
నల్లధనం వివరాలు గోప్యంగా ఉంచుతామని కేంద్రం చెప్పిందని అన్నారు. నగరాలు, ప్రాంతాలవారీగా వెల్లడించిన నల్లధనం వివరాలు కేంద్రం చెప్పదని ఉండవల్లి తెలిపారు. ఏపీ, తెలంగాణ నుంచే 25 శాతం నల్లధనం వచ్చిందని ప్రచారం జరుగుతోందని ఉండవల్లి అన్నారు. రూ.10 వేల కోట్ల నల్లధనాన్ని జగన్ ప్రకటించారని ప్రచారం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications