కేసీఆర్తో సోనియా కంగు, విభజన జరగలేదు, జైపాల్ రెడ్డే చెప్పారు: ఉండవల్లి
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ 'విభజన కథ' పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పైన పుస్తకం రాశారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడారు. విభజన ద్వారా సీమాంధ్రలో జరిగిన నష్టాన్ని కేసీఆర్ ద్వారా పూడ్చుకుందామని కాంగ్రెస్ భావించిందన్నారు.
కాంగ్రెస్ను ఖంగు తినిపించిన కేసీఆర్
కానీ తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలపకపోవడం ద్వారా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించారని చెప్పారు. తన విభజన కథ పుస్తకంలో ఢిల్లీ, హైదరాబాదులలో నాడు ఏం జరిగిందో వివరించానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి తప్పు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు చూసుకుందన్నారు.
బలాబలాలు చూసిన విభజన జరగదని ఏపీ వాసులు భావించారన్నారు. విభజన ద్వారా సీమాంధ్రలో నష్టం జరుగుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ, ఆ లోటును తెరాసను తమ పార్టీలో విలీనం చేసుకొని పూడ్చుకుందామని భావించిందన్నారు. కానీ కెసిఆర్ తన పార్టీని విలీనం చేయలేదన్నారు. కెసిఆర్ తీరుతో కాంగ్రెస్ కంగు తిన్నదన్నారు.
నా దృష్టిలో విభజన జరగలేదు
ఏమాత్రం బలం లేని బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో షాకిచ్చిందన్నారు. తన దృష్టిలో ఇప్పటికీ విభజన జరగలేదని చెప్పారు.
కేసీఆర్ చేసిందేమీ లేదు, జైపాల్ రెడ్డే చెప్పారు
తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ఎంపీల వల్లే సాధ్యమైందన్నారు. 2009 తర్వాత కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ అనే ఒక బొమ్మను ఊరేగిస్తూ తిరిగి, ఆయనను హైలైట్ చేశారని జైపాల్ రెడ్డి కూడా చెప్పారని ఉండవల్లి అన్నారు. కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష ఏమిటో తమకు తెలుసని, కానీ తెలంగాణ ఉద్యమానికి దెబ్బ తగులుతుందనే తాము బయటపెట్టలేదని జైపాల్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు.
మరో సందర్భంలో ఉండవల్లి మాట్లాడుతూ.. విభజన జరగడం కన్నా, అది జరిగిన తీరు ఎక్కువగా గాయపరిచిందని, అవమానపరిచిందని ఉండవల్లి అన్నారు. తనకు డైరీ రాసే అలవాటు ఉందని, పాత పేజీలన్నీ తిరగేశానని, విభజన విషయంలో ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తే, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇంత ఘోరం ఎప్పుడూ జరగలేదన్నారు.
పార్లమెంట్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరుపుకుంటూ వచ్చినప్పుడు పార్లమెంట్ తలుపులు మూయలేదన్నారు. విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసేసి డివిజన్ లేకుండా విభజన చేయడం దారుణమని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.